ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన, జ్ఞాన వికాసం, జ్ఞానాభివృద్ధి కోసం జనగామ జిల్లా విద్యాశాఖ ‘పుస్తకాంజలి’ పేరిట బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు, కవులు, కళాకారులు.. ఇలా ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద ఖాళీగా ఉన్న డిక్షనరీలు, జీకే పుస్తకాలు, కథల పుస్తకాలు, విజ్ఞాన, వినోదదాయక పుస్తకాలు, రామాయణం, మహాభారతం పుస్తకాలను.. ఇతర విద్యార్థులకు ఉపయోగపడే ఏ పుస్తకాన్నైనా దానం చేయాలని కోరుతోంది. ఈ మహాయగ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వేడుకుంటోంది.
– దేవరుప్పుల, డిసెంబర్ 20
జనగామ జిల్లా విద్యాశాఖ పుస్తకాంజలి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పలు సంస్థలు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన, జ్ఞాన వికాసం, జ్ఞానాభివృద్ధికి పుస్తకాంజలి తోడ్పడుతుంది. విద్యాభిలాషులు, పదవీ విరమణ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఉన్నత విద్య చదివిన వారు, గ్రంథాలయాభిలాషులు, కవులు, కళాకారులు ఈ బృహత్కార్యక్రమంలో భాగస్వాములు కావాలని విద్యాశాఖ వేడుకుంటోంది. వీరంతా తమ తమ ఇండ్లల్లో నిక్షిప్తమై ఉన్న పుస్తకాలను విద్యాశాఖకు దానం చేసే కార్యక్రమమే పుస్తకాంజలిగా నామకరణం చేశారు. ఈ పుస్తకాంజలి విజయవంతమైతే నూతన ఒరవడికి విద్యాశాఖ నాంది పలికినట్టవుతుందని అధికారులు తెలిపారు.
ఉపాధ్యాయ, ఉద్యోగులు తమ ఇంటి గ్రంథాలయంలో ఉన్న డిక్షనరీలు, జీకే పుస్తకాలు, కథల పుస్తకాలు, విజ్ఞాన, వినోదదాయకమైన పుస్తకాలు, రామాయణం, మహాభారతం పుస్తకాలను మండలకేంద్రంలో ఉన్న విద్యావనరుల కేంద్రంలో అందిస్తే సరిపోతుంది. మరోవైపు ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు తాము గతంలో చదివిన పాఠశాలల పుస్తకాలు, ఎంసెట్, నీట్, జేఈఈ ప్రిపరేషన్ పుస్తకాలు, ఇంట్లో వృథాగా పడి ఉన్నత ఇతర పుస్తకాలు విద్యాశాఖకు దానం చేయాలని విద్యాశాఖ కోరుతుంది. మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రానికి చేరిన ఈ పుస్తకాలను మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అవసరాన్ని బట్టి అందజేస్తారు.
పేద విద్యార్థులకు పుస్తకాంజలి ఓ వరం
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు విలువైన పుస్తకాలు కొనే స్థోమత లేక చదువుతో కొంత వెనుకబాటును చవిచూస్తున్నారు. ఈ వెలితిని పూడ్చేందుకు జిల్లా విద్యాశాఖ పుస్తకాంజలిని ప్రారంభించింది. దాతలు సమకూర్చే పుస్తకాల వల్ల విద్యార్థుల్లో పఠనాశక్తి, అభ్యనాభివృద్ధి, విద్యావికాసం, నైతిక విలువలు, స్వతంత్ర ఆలోచనా విధానం పెంపొందించేందుకు ఇది తోడ్పడుతుంది. ఇందుకుగాను జిల్లాలోని మేధావి వర్గం స్పందించి చేయూతనివ్వాలి. మరోవైపు మన పురాణగాథలు, ఇతిహాసాలు కొందరి ఇండ్లలో నిరుపయోగంగా పడి ఉంటాయి. వీటిని పుస్తకాంజలికి అందిస్తే విద్యార్థులకు మేలవుతుంది. విద్యార్థులకు అవసరమయ్యే ఏ పుస్తకాలైనా స్వీకరిస్తాం.
ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్ తర్వాత పైచదువులకు రాసే ఎంట్రన్స్ పరీక్షలైన నీట్, ఎంసెట్, జేఈఈ సంబంధిత పుస్తకాలను పదో తరగతిలోనే నేర్చుకునే వీలుంటుంది. పుస్తకాంజలి ద్వారా పాఠశాలల్లో ఏర్పాటుచేసే గ్రంథాలయాల వల్లే ఇది సాధ్యమవుతుంది. ఈ పుస్తకాలు చదువుతో పాటు ఉపాధ్యాయుల బోధన తోడైతే విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం.
– రాము, జిల్లా విద్యాశాఖాధికారి, జనగామ
అందరూ భాగస్వాములు కావాలి..
పుస్తకాంజలి అనే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. పేద విద్యార్థులకు చేయూతనిచ్చే ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తిస్తుంది. దాతలు స్పందించి ఎక్కువ పుస్తకాలు అందిస్తే వీటిని ఇతర మండలాలకు అందిస్తాం. రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు తమ ఇండ్లలో ఉన్న విలువైన పుస్తకాలను సమర్పించాలి. ఈ పుస్తకాలన్నీ ప్రభుత్వ విద్యాలయాలైన పాఠశాలలు, కస్తూర్బా కళాశాలలు, ఎంఆర్ఎస్, టీఎస్ఎంఎస్ బాలబాలికల వసతిగృహాలు జిల్లాలోని అన్ని ప్రభుత్వరంగ పాఠశాలలు, కళాశాలలకు అందిస్తాం.
– బొమ్మనబోయిన శ్రీనివాస్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి, జనగామ