అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం ప్రీ స్కూల్ కిట్లు అందించి చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్నది. బడిని ఆకర్షించేలా ఆట వస్తువులను అందించి, వివిధ రకాల క్రీడలను ప్రోత్సహిస్తున్నది. సెంటర్లలో చిన్నారులు,గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించడంతో పాటు పిల్లలకు నాణ్యమైన బోధ న అందిస్తున్నది. చిన్నారులు బడి అంటే ఇష్టపడి వచ్చే లా వారికి ప్రీ స్కూల్ కిట్లతో టీచర్లు అక్షరాలను బొమ్మ ల రూపంలో పాఠాలు చెబుతున్నారు. అక్షరాభ్యాసంతో పాటు ఆటలపై ఆసక్తి పెరిగేలా ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు ప్రీ స్కూల్ కిట్లతో విద్యా బోధ న చేస్తూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా కృషిచేస్తున్నారు.
బచ్చన్నపేట, డిసెంబర్ 26 : చిన్నారుల బంగారు భవిష్యత్ కోసం రాష్ట్ర సర్కారు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నది. బడికి వెళ్లాలంటే భయం ఉన్న చిన్నారుల్లో దాన్ని తొలగించి ఎంచక్కా సెంటర్లకు వచ్చేలా వారికి అవసరమైన వసతులు కల్పిస్తున్నది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ కిట్లతో చిన్నారులకు అక్షరాలు నేర్పిస్తున్నారు. ఇంగ్లిష్ లెటర్లు, పదాలు, బొమ్మలతో బోధిస్తున్నారు. బడిని ఆకర్షించేలా ఆట వస్తువులతో విజ్ఞానాన్ని అందిస్తున్నారు. దీంతో సెంటర్లు కార్పొరేట్ తరహా ప్లే స్కూళ్లను తలపిస్తున్నాయి.
చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం.
చిన్నారులు ప్రాథమిక విద్యపై ఆసక్తి చూపేలా, వారంతా ఆరోగ్యంగా ఉండేలా సర్కారు కృషిచేస్తోంది. వారిలో ఆత్మ విశ్వాసం పెంచేందుకుగాను ప్రీ స్కూల్ కిట్లు అందించింది. దాంతో పిల్లలు కేంద్రాలకు అలవాటయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. పెన్సిళ్లు, బలపాలు పట్టుకోవడం, మునివేళ్ల మీద నడువడంతో కేంద్రాల్లో బోధన మొదలు పెడుతున్నారు. వేగంగా పరుగెత్తడం, బంతులు విసరడం, తన్నడం, తన పనులు తానే చేసుకునే విధంగా నైపుణ్యం పెరిగేలా చేయూతనిస్తున్నారు. అందరితో స్వేచ్చగా మాట్లాడడం, కుటుంబ సభ్యుల గురించి ఇతరులతో చర్చించడం, తప్పొప్పులు తెలుసుకోవడం, ఆడుకోవడం, ఉద్వేగానికి వెళ్లకుండా వారిని గుర్తించడం వంటివి చిన్నారులకు నేర్పిస్తున్నారు. కథలు, సంఘటన రూపంలో చిన్నారులకు బోధన చేస్తున్నారు. ఒకటి నుంచి పది అంకెల వరకు లెక్కించడం, కూడడం, తీసివేయడం వంటివి నేర్చుకునేందుకు ప్రీ స్కూల్ కిట్లను ఉపయోగిస్తున్నారు. దాంతో చిన్నారులకు చదువుపై ఆసక్తి పెరుగుతోంది.
జిల్లాలో 695 కేంద్రాలు.
జనగామ జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల ప్రాజెక్టుల పరిధిలో 695 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అందులో 23,251 మంది పిల్లలు, 3127 మంది బాలింతలు, 3208 మంది గర్భిణులు ఉన్నారు. వారికి నిత్యం పాలు, గుడ్లు, ఆకుకూరలతో పౌష్టికాహారం అందిస్తున్నారు. ఏ వయస్సులో ఎంత బరువు, ఎత్తు ఉండాలో పర్యవేక్షణ జరుపుతున్నారు. ఆరోగ్యలోపం లేకుండా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆటపాటలతో కూడిన విద్యను అందించేలా, చిన్నారులు సకాలంలో కేంద్రాలకు హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా రూపొందించిన ఎన్హెచ్టీఎస్లో పిల్లల హాజరు శాతం, సమయపాలన, గర్భిణులు, బాలింతల వివరాలను ఎప్పటికప్పుడునమోదు చేస్తున్నారు.
పకడ్బందీగా పర్యవేక్షణ..
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నాం. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్య నేర్పిస్తూ వారిలో మరింత ఆత్మ విశ్వాసం పెరిగేలా సేవలు అందిస్తున్నం. చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాలకు పంపించడంలో తల్లిదండ్రులు ముందుండాలి. కేంద్రాల పనితీరు మెరుగుతో పాటు పారదర్శకంగా సేవలు అందించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్లు రూపొందించింది.
– జయంతి, స్త్రీ శిశు సంక్షేమాధికారి, జనగామ
అంకితభావంతో పనిచేస్తున్నం..
ప్రభుత్వం అందించే ప్రోత్సాహంతో అంకితభావంతో పనిచేస్తున్నం. ప్రీ స్కూల్ కిట్లతో చిన్నారులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తున్నం. సకాలంలో పౌష్టికాహారం అందిస్తు న్నం. అక్షరాలతో పాటు ఆటపాటలతో జానాన్ని అందిస్తున్నం. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటిక ప్పుడు పర్యవేక్షిస్తున్నం.
– మేకల రేణుక, అంగన్వాడీ టీచర్, జనగామ