నమస్తే తెలంగాణ నెట్వర్క్ : గులాబీ దళపతి, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్లు కట్ చేసి, పటాకులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. దవాఖానాల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. బీఆర్ఎస్ హనుమకొండ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అలాగే హంటర్రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కేక్ కట్ చేశారు. వరంగల్ నగరంలో తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కేక్ కట్ చేశారు.
నర్సంపేట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కేక్ కట్ చేసి, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం భీమారంలో జరిగిన వేడుకల్లో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే రమేశ్ పాల్గొని కేక్ కట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పీహెచ్సీలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్రావు రోగులకు పండ్లు పంపిణీ చేసి, ఆవరణలో మొక్కలు నాటారు. పట్టణంలోని తన నివాసంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, డోర్నకల్లో మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, ఇనుగుర్తిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, గాయత్రీ గ్రూప్ అధినేత వద్దిరాజు కిషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, పటాకులు పేల్చి కేసీఆర్ బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్కట్ చేశారు. కేసీఆర్ తన పుట్టిన రోజు కానుకగా ములుగును జిల్లాగా ఏర్పాటు చేశారని నాగజ్యోతి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జడ్పీ వైస్చైర్ పర్సన్ కళ్లెపు శోభారఘుపతిరావు, మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి కేక్ కట్ చేశారు. కడియం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య నేతృత్వంలో స్టేషన్ఘన్పూర్లో కేసీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించారు.