పరకాల, నవంబర్ 28 : గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధే ప్రథమ ఎజెండాగా పాలన చేశామని, పరకాల రూపురేఖలు మార్చామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫ లాలు అందాయన్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును నియోజకవర్గంలోని గీసుకొండ, సంగెం మండలాల్లో నిర్మించామని, ఇందులో ఇప్పటికే రెండు కంపెనీలు ఉత్పత్తులను ప్రారంభించాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఏండ్లుగా నెలకొని ఉన్న నీటి కష్టాలను మిషన్ భగీరథ ద్వారా తీర్చిందని, ఇంటింటికీ నల్లా నీళ్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు అండగా నిలిచి మరోసారి గెలిపించాలన్నారు. ప్రజలను మోసం చేసేందుకు విపక్షాలు మాయమాటలు చెప్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల దొంగ ప్రమాణాలు, బాండ్ పేపర్లను ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నా రు. రైతుబంధుపై కాంగ్రెస్ కుట్రలు చేసిందన్నారు. నర్సంపేట, హనుమకొండలో చెల్లని రూపాయి రేవూరి అని మరి పరకాలలో ఏ విధంగా చెల్లుతుందో చెప్పాలన్నారు. ఎన్నికలు రాగానే దొంగ వాగ్దానాలు చేయడం రెండు పార్టీలకు అలవాటేనని, వారి మాటలు నమ్మితే నట్టేట ముంచుతారని పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే మరిన్ని పథకాలు ప్రజలకు అందుతాయని, బీఆర్ఎస్కు మరో సారి అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో చల్లా జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత, పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీను, నాయకులు బండి సారంగపాణి, రేగూరి జయపాల్ రెడ్డి, సోదా రామకృష్ణ, నల్లెల్ల లింగమూర్తి, నిప్పాని సత్యనారాయణ, దగ్గు విజేందర్రావు, పావుశెట్టి వెంకటేశ్వర్లు, గందె వెంకటేశ్వర్లు, చందుపట్ల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.