KCR : వరంగల్ జిల్లాలోని ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి(Koosam Rajmouli) మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం ప్రకటించారు. గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం తెలిపి, దేశానికే ఆదర్శ గ్రామంగా నిలిచిన తెలంగాణ పల్లెగా, గంగదేవిపల్లిని తీర్చిదిద్దడంలో రాజమౌళిది కీలక పాత్ర అని కేసీఆర్ తెలిపారు.
గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసి, అన్ని రంగాలను అభివృద్ధి పరిచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, పల్లెల అభ్యున్నతికి అసలైన నిర్వచనం చెప్పిన వ్యక్తి కూసం రాజమౌళి అని గులాబీ బాస్ కొనియాడారు. వారి మరణం దేశ పంచాయతీ రాజ్ వ్యవస్థకు తీరని లోటని అన్నారు. దేశంలోని గ్రామాలు ఒక ఆదర్శవంతమైన సర్పంచిని కోల్పోయాయని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన పల్లె ప్రగతి, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో రాజమౌళి అనుభవాలను నాటి ప్రభుత్వం వినియోగించుకున్నదని ఆయన తెలిపారు.
రాజమౌళి కృషిని గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించుకున్నదని కేసీఆర్ వెల్లడించారు. రాజమౌళితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తమ గ్రామాలను కూడా గంగదేవిపల్లి మాదిరి తీర్చిదిద్దుకోవాలనే ఆకాంక్షతో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పల్లెల్లోని నాయకులు మేధావులు సందర్శించి వెళ్లేలా, ఒక అభివృద్ధి నమూనా గ్రామంగా, గంగదేవిపల్లిని తీర్చిదిద్దిన ఘనత రాజమౌళిదేనని కేసీఆర్ తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..
వారి మరణంతో శోకతప్తులైన కుటుంబసభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన రాజమౌలి ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు.