హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 27 : ఉమ్మడి రాష్ట్రంలో మన దగ్గర ఉపాధి లేక వలస వెళ్లినవారితో కళ తప్పిన పల్లెలే కనిపించేవి.. స్వరాష్ట్రంలో ఇప్పుడు అవే పల్లెలు మరొకరికి బతుకుదెరువు చూపుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వ్యవసాయం పండుగైన తరుణంలో ఇతర రాష్ట్ర కూలీలకు పని కల్పించే స్థాయికి చేరాయి. రాష్ట్ర సర్కారు చేపట్టిన పలు పథకాలతో ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా మెట్ట రైతులు సైతం తమ భూకమతాలను వరి మాగాణులుగా మార్చుకున్నారు. దీంతో స్థానికంగా నాట్లు వేసేందుకు కూలీల కొరత భారీగా ఏర్పడింది. దీనికితోడు కొత్త తరం యువత నాట్లు వేసేందుకు ఇష్టపడడం లేదు. క్రమంగా ఏటా నాటేసేవారి నైపుణ్యం తగ్గి పోతున్నది. ఇందుకు ప్రత్యామ్నాయ మర్గాల అన్వేషణలో భాగంగా ఇతర రాష్ర్టాల కూలీల ఆగమనం ప్రారంభమైంది. ఉత్తరాది రాష్ర్టాలైన ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్తో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా నుంచి మగ కూలీలు వచ్చి రైతులకు కూలీల కొరత తీరుస్తున్నారు. ఇప్పుడు వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇసారి కూడా ఇతర రాష్ర్టాల కూలీలు తరలి వచ్చారు. అయితే గతానికి భిన్నంగా వేలాది మంది స్థానిక రైతుల పంట క్షేత్రాలకు పోటెత్తారు. గతంలో కేవలం మగ కూలీలే వచ్చేవారు. ఇసారి మహిళలు సైతం నాట్లేసేందుకు వచ్చారు. గతంలో మండలానికి రెండు మూడు బ్యాచ్లు మాత్రమే రాగా, ఇసారి పత్రి గ్రామానికి రెండు మూడు బృందాలు నాటేసేందుకు తరలి వచ్చాయి. దాదాపు ప్రతి గ్రామంలో సగం వరకు నాట్లు మొత్తం వలస కూలీలే పూర్తి చేస్తున్నారు. దీంతో స్థానిక కూలీలపై పెద్ద ఎత్తున్న ఒత్తిడి తగ్గుతున్నది.
వరి నాట్లు వేసేందుకు వలస కూలీలు రోజూ సూర్యోదయం కంటే ముందే పంట పొలాల్లోకి దిగుతున్నారు. ప్రస్తుతం వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సాధ్యమైనంత ఎక్కువ సమయం వరి పొలంలోనే గడిపి ఎక్కువ డబ్బులు సంపాదించుకొని వెళ్లాలనే ఆతృత వలస కూలీల్లో కనిపిస్తున్నది. దీంతో నిత్యం 12 గంటల పాటు పొలాల్లోనే గడుపుతున్నారు. నారు సేకరణ మొదలు, నారు పంపకం, నాట్లు వేయడంతో పాటు అవసరమైతే ఎరువులు సైతం చల్లుతున్నారు. సంబంధిత రైతులు వారిని గమనిస్తూ తమకు కావాల్సిన తీరులో నాట్లు వేయించుకుంటున్నారు.
వలస కూలీలు తమ వంటలను సైతం పొలాల వద్దే తయారు చేసుకుంటున్నారు. వీరిని పంట క్షేత్రాలకు తీసుకొచ్చే ఆసాములే వారికి గ్యాస్తో పాటు ఇతర వంట సామగ్రి సమకూర్చుతున్నారు. కూలీల్లో ఒకరిద్దరు వంట పనులు చూసుకుంటున్నారు. సమయానికి వంట పూర్తి కాగానే పొలం గట్లపైనే తిండి కానిచ్చేస్తున్నారు. స్థానిక కూలీలు ఎకరాకు పది నుంచి పన్నెండు మంది నాట్లు వేస్తే వీరు మాత్రం ముగ్గురు, నలుగురే పూర్తిచేస్తున్నారు. దీంతో కూలీల ఖర్చు తగ్గుతుండడంతో రైతులు వీరివైపే మొగ్గు చూపుతున్నారు. వీరు వరి నారును వంచి వేయకుండా నిటారుగా వేస్తుండడంతో దిగుబడి పెరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లాలో నాట్లు వేసేందుకు సుమారు 30 వేల మంది వలస కూలీలు వచ్చినట్లు అంచనా. కరీంనగర్లోని ఎల్ఎండీ(లోయర్ మానురు డ్యాం) నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయడంతో వరి నాట్లు ఊపందుకోనున్నాయి.
ప్రతి సీజన్లో రైతులంతా ఒకేసారి నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటారు. దీంతో కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. స్థానిక మహిళా కూలీలు అందక నార్లు ముదిరి దిగుబడిపై ప్రభావం పడుతుంది. రైతులకు నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఇతర రాష్ర్టాల నుంచి తీసుకువచ్చిన కూలీలతో అదును దాటక ముందే నాట్లు పూర్తవుతున్నాయి. నేను పశ్చిమబెంగాల్ నుంచి ఇరవై మంది కూలీలను తీసుకు వచ్చి నాట్లు వేయిస్తున్నా.
– కొమ్మిడి తిరుమల్రెడ్డి, వలస కూలీల ఆసామి
వలస కూలీలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాట్లు వేస్తున్నారు. నారు వాళ్లే పీక్కుని వాళ్లే పంచుకుంటున్నారు. దీని వల్ల రైతులకు పని సులభతరమవుతున్నది. స్థానిక కూలీలు నాటు పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు. దీనికి తోడు నారు మనమే పంచి వేయాలి. వీళ్లకు కొంత ఎక్కువ డబ్బు ఇస్తే పొలంలో ఎరువులు కూడా చల్లుతున్నారు. – మారం నరేందర్ రెడ్డి, రైతు
మా రాష్ట్రంలో ఎక్కువ పనుల్లేవు. కరంటు కూడా సక్కగ రాదు. అందుకే ప్రతి సీజన్లో ఇక్కడికి వచ్చి నాట్లు వేసి సంపాదించుకుంటున్నం. ఇంతకు ముందు మా ఇండ్లలో మగవాళ్లు మాత్రమే నాట్లు వేసేందుకు వచ్చేటోళ్లు. ఇప్పుడు మేంకూడా వస్తున్నం. ఇక్కడ నాట్లు పూర్తి అయిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్తాం. ఏటా రెండు సీజన్లు కలిపి నాలుగు నెలల పాటు మాకు ఇక్కడ పని దొరుకుతుంది. ఇక్కడి రైతులు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు.
-మీనియా, వలస కూలీ, పురూలియా జిల్లా, పశ్చిమ బెంగాల్