వరంగల్, జనవరి 25(నమస్తేతెలంగాణ): కంటి వెలుగు శిబిరాల్లో వైద్య సిబ్బంది రోజు రోజుకూ సేవలను విస్తృతం చేస్తున్నారు. ఐదో రోజు బుధవారం జిల్లాలోని 44 నేత్ర శిబిరాల్లో 6,596 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అత్యధికంగా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి నేత్ర శిబిరంలో 231 మందికి కంటి పరీక్షలు చేశారు. ఐదు రోజుల్లో నేత్ర పరీక్షలు పొందిన వారి సంఖ్య 30,619కి చేరింది. ఉచిత కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాలు పొందే వారి సంఖ్యను క్రమేనా పెంచుతున్నారు.
నంబర్వన్ స్థానంలో మేడపల్లి
కంటివెలుగు కార్యక్రమం ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న 44 నేత్ర శిబిరాల్లో బుధవారం ఉచిత కంటి పరీక్షల నిర్వహణలో మేడపల్లి శిబిరం నంబర్వన్ స్థానంలో నిలిచింది. 6,596 కంటి పరీక్షల్లో 231 మేడపల్లి నేత్ర శిబిరంలో జరిగాయి. 214 కంటి పరీక్షలతో ఖానాపురం మండలం ధర్మారావుపేట శిబిరం రెండు, 213 నేత్ర పరీక్షలతో నర్సంపేట మండలం ఇటికాలపల్లి శిబిరం మూడో స్థానం కైవసం చేసుకుంది.
వరంగల్లోని 12వ వార్డు శిబిరంలో 203, సంగెం మండలంలోని గవిచర్ల శిబిరంలో 196, నల్లబెల్లి మండలకేంద్రంలోని శిబిరంలో 172, వరంగల్లోని 21వ వార్డు శిబిరంలో 171 మందికి వైద్యులు, సిబ్బంది ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. గీసుగొండ మండలం ఊకల్ శిబిరంలో 165, వరంగల్లోని మూడో వార్డు శిబిరంలో 165, నర్సంపేటలోని 22వ వార్డులో 161, నర్సంపేట మండలం భాంజీపేట శిబిరంలో 160, వరంగల్లోని 36, 22, 15వ వార్డుల్లోని శిబిరాల్లో 158 మందికి చొప్పున, దుగ్గొండి శిబిరంలో 157, గీసుగొండ మండలం వంచనగిరి శిబిరంలో 156, చెన్నారావుపేటలో 155, వరంగల్లోని 35వ వార్డు శిబిరంలో 152, ఇక్కడి 26వ వార్డు శిబిరంలో 151 మందికి ఉచిత నేత్ర పరీక్షలు జరిగాయి. వీరిలో కొందరికి రీడింగ్ కళ్లద్దాలను అందజేసి మరికొందరికి ప్రిస్కిప్షన్ కళ్లద్దాల కోసం వైద్యులు, సిబ్బంది ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేశారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీకాలనీ నేత్ర శిబిరాన్ని కలెక్టర్ బీ గోపి ఆకస్మికంగా సందర్శించారు.
శిబిరంలో కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాల పంపిణీని పరిశీలించారు. నిర్వహణపై శిబిరంలోని వైద్యులు, సిబ్బందితో మాట్లాడిన ఆయన వారికి కొన్ని సూచనలు చేశారు. శిబిరంలో కంటి పరీక్షలను పొందిన లబ్ధిదారులతోనూ కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంటివెలుగు కార్యక్రమం ద్వారా సేవలను పొందాలని అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కే వెంకటరమణ వరంగల్లో పైడిపల్లి, దేశాయిపేట నేత్ర శిబిరాలను సందర్శించారు. సమన్వయంతో పనిచేయాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు.