హనుమకొండ చౌరస్తా, జనవరి 25: చారిత్రక వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణమండపాన్ని వెయ్యేళ్లు నిలిచేలా నాణ్యతతో పటిష్టంగా నిర్మిస్తున్నట్లు కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ యధుబీర్ సింగ్ రావత్ తెలిపారు. గురువారం ఆలయంలోని కల్యాణమండపాన్ని అడిషనల్ డైరెక్టర్ జాన్వీజ్శర్మ, డైరెక్టర్ రాంజినగమ్, రీజినల్ డైరెక్టర్ పాఠక్, హైదరాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ స్మిత్ ఎస్ కుమార్, ఇంజినీర్ కృష్ణచైతన్యతో కలిసి ఆయన పరిశీలించారు. వారికి ఈవో కె.వెంకటయ్య స్వాగతం పలుకగా, రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తీర్థప్రసాదాలు, శేషవస్ర్తాలు అందించారు. ఈ సందర్భంగా యధుబీర్ సింగ్ మాట్లాడుతూ కల్యాణ మండపం పనుల్లో కొంత జాప్యం జరిగినా నాణ్యమైన కట్టడాలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. మార్చిలో ప్రారంభించేందుకు ప్రధాని మోడీ రానున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఆలయం చుట్టూ ఉన్న ఇండ్లను తొలగించి అక్కడి వారిని వేరే చోటికి తరలిస్తే రామప్ప తరహాలో వేయిస్తంభాల దేవాలయాన్ని యునెస్కోలో చేర్చేలా ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు. ఇంకా 8 స్తంభాలు అమర్చి పైకప్పు ఏర్పర్చాలని, మార్చి నెలలోపు కల్యాణ మండపం పనులు పూర్తవుతాయని స్థపతి శివకుమార్ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో త్రికూటాలయం చుట్టూ కిందిభాగంలో రెండు లేయర్లు పైకి తీయాల్సిన అవసరం ఉందని, త్వరితగతిన పూర్తిచేసి గార్డెన్ ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామని పురావస్తుశాఖ జిల్లా అధికారి మల్లేశం చెప్పారు. ఈ దేవాలయం త్రికూటాలయంగా కాకతీయులు భక్తుల మనోభావాలకనుగుణంగా నిర్మించారని, కానీ రాష్ట్ర, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారని గంగు ఉపేంద్రశర్మ డైరెక్టర్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామప్ప దేవాలయ పరిసర ప్రాంతాల్లో పనుల విషయంలో అలసత్వం జరుగుతోందని మాజీ మేయర్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు, ప్రొఫెసర్ పాండు రంగారావు డైరెక్టర్ జనరల్కు ఫిర్యాదు చేశారు.