పరకాల, జూలై 8 : హనుమకొండలో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలన్నీ అబద్దాలేనని, మోదీ రైతు వ్యతిరేకి అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలో శనివారం నిర్వహించిన సభలో గ్రీన్ఫీల్డ్ హైవేను ప్రారంభించడంతో పాటు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కునుతామే ఏర్పాటు చేశామంటూ ప్రధాని ప్రసంగించడంపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చొరవతోనే నియోజకవర్గంలోని గీసుకొడ, సంగెం మండలాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు భూ సేకరణ కోసం తీవ్రం గా కష్టపడ్డామని, ఎకరాకు రూ. మూడు లక్షల మార్కెట్ విలువ ఉంటే రూ. పది లక్షలు చెల్లించి భూ సేకరణ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు.
అంతే కా కుండా టెక్స్టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన వంద గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో టెక్స్టైల్ పార్కులో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ప్రారంభించిన వివిషయం మెదీకి తెలియకపోవచ్చని, కాని, తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. మెగా టెక్స్టైల్ పార్కు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కష్టపడి అబివృద్ధి చేస్తే, చివరికి మేమే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేశామని మోదీ చెప్పడం సిగ్గు చేటని విమర్శించారు. టెక్స్టైల్ పార్కు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం కృషి ఏమాత్రం లేదని, ముమ్మాటికి టెక్స్టైల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్నారు.
గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని నిలిపివేయాలి..
రైతులకు ఏ మాత్రం ఉపయోగం లేని గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వెంటనే నిలిపి వేయాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకరవ్గం మీదుగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ హైవేతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అంతేకాకుండా రైతులు రోడ్డున పడుతారన్నారు. గ్రీన్ ఫీల్డ్ వైవే నిర్మాణంలో రైతులతో సంప్రదించకుండానే పనులకు శంకుస్థాపన చేయడం రైతులపై మోదీకి ఉన్న కపట ప్రేమను తెలియజేస్తుందన్నారు.
మార్కెట్ విలువల్లో ఎకరాకు రూ.కోటి నుంచి మూడు కోట్ల వరకు భూముల రేట్లు ఉన్నాయని, ఈ విషయమై కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందించినా స్పందించలేదన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే అంబానీ, అదానీలకు మాత్రమే పనికి వస్తుందని, రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. రైతులకు ఉపయోగం లేని గ్రీన్ ఫీల్డ్ హైవేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి, పాత బోగీలకు ప్యాచ్లు వేసే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని విమర్శించారు. ప్రధాని పర్యటనలో తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకుని, నిధుల కేటాయింపు లేకుండానే పర్యటనను ముగించాడని ఎద్దేవా చేశారు.