వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 15: తెలంగాణ ఉన్నత విద్యాశాఖ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కొనసాగే యూత్ ఫెస్ట్కు కాకతీయ మెడికల్ కళాశాల వేదికైంది. రెండు రోజులపాటు కొనసాగనున్న సాంస్కృతిక పోటీలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తుండగా, కేఎంసీ వేదిక కానున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాంకుమార్రెడ్డి తెలిపారు. గురువారం ఎన్నారై భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేఎంసీ రెండోసారి ఈ పోటీలకు వేదికగా మారనుందన్నారు. ఇప్పటి వరకు ఎక్కువసార్లు పోటీలకు వేదికగా నిలిచిన ఘనత కేఎంసీకే దక్కుతుందన్నారు.
కరోనా కారణంగా రెండేళ్లుగా సాంస్కృతిక పోటీలు నిర్వహించలేకపోయామని తెలిపారు. చదువుతోపాటు సాంస్కృతిక రంగాల్లో విద్యార్ధుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 యూనివర్సిటీల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొననున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు నేడు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కేఎంసీ ఎన్ఆర్ఐ భవన్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
జీ 20 దేశాల సదస్సుకు భారత్ ప్రాతినిథ్యం వహించడంపై యువతకు అవగాహన, స్వచ్ఛభారత్, స్వచ్ఛత థీమ్గా చిత్రలేఖనం, వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్, పద్యరచన, ఫొటోగ్రఫీ, యూత్ పార్లమెంట్, డ్యాన్స్, నృత్యం, సంగీత వాయిద్యం.. 17 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. నేడు సాయంత్రం 3 గంటలకు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎస్ఎస్ రాష్ట్ర బాధ్యులు నవీన్మిట్టల్, కాళోజీ హెల్ ్తయూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి హాజరవుతారని వివరించారు. శనివారం ఉదయం 7 గంటలకు కేఎంసీ నుంచి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వరకు స్వచ్ఛభారత్ ర్యాలీ ఉంటుందన్నారు.