హనుమకొండ, జూలై 7 : కమల్చంద్రభంజ్దేవ్ గురువారం మధ్యాహ్నం హనుమకొండ పద్మాక్షి కాలనీలోని అగ్గలయ్యగుట్టను సందర్శించారు. పద్మాక్షి దేవాలయ ప్రధాన అర్చకుడు శంకర్శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం నగరంలోని పలువురు జైనులు కమల్చంద్రను సత్కరించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్యాదవ్, కమిషనర్ ప్రావీణ్య, హనుమకొండ ఆర్డీవో వాసుచంద్ర, కాజీపేట తహసీల్దార్ కిరణ్కుమార్, ఆర్ఐ సురేందర్ పాల్గొన్నారు.
టీజీవోల సన్మానం..
కాకతీయ వైభవ సప్తాహం మొదటి రోజు కార్యక్రమాలకు హాజరై హరిత హోటల్కు వచ్చిన కాకతీయ వారసుడు కమల్చంద్రభంజ్దేవ్ను టీజీఓవోలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్రావు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్రెడ్డి, హనుమకొండ జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, రాజేశ్కుమార్, నాగ నారాయణ, రాంచందర్రావు, పొట్లపల్లి శ్రీనివాసరావు, ఆస్నాల శ్రీనివాస్, రియాజుద్దీన్, అశోక్రెడ్డిలు పాల్గొన్నారు.
ఓరుగల్లు వంటకాలు బాగున్నాయి..
ఓరుగల్లు వంటకాలు బాగున్నాయని కాకతీయుల 22వ వారసుడు కమల్చంద్రభంజ్దేవ్ అన్నారు. కాకతీయ వైభవ సప్తాహ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరానికి వచ్చిన ఆయన హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఒంటరిగానే తనకు కేటాయించిన గదిలో సంప్రదాయ భోజనం చేశారు. హోటల్ మేనేజర్ అశోక్రెడ్డి పర్యవేక్షణలో తయారు చేసిన వెజ్ పులావ్, పన్నీర్ బట్టర్, పుల్క, మిర్చి బజ్జి, దాల్, కడాయి పన్నీర్, పచ్చి పులుసు, గొంగూర చట్నీ, బెండి గ్రౌండ్ నట్, వైట్ రైస్, పెరుగు, వడియాల లాంటి శాకాహార వంటకాల రుచి చూశారు. అలాగే, తాజా పండ్ల ముక్కలు తిన్నట్లు సర్వ్చేసిన హోటల్ సిబ్బంది తెలిపారు. వంటకాలను తయారు చేసిన వారిని ఆయన అభినందించారు.
కమల్చంద్రభంజ్దేవ్ను కలిసిన సీపీ
సుబేదారి : కాకతీయుల వారసుడు కమల్చంద్రభంజ్ దేవ్ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరుణ్జోషి మర్యాదపూర్వకంగా కలిశారు. కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలకు విచ్చేసిన ఆయనను నక్కలగుట్ట హరిత హోటల్లో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.