హనుమకొండ, జనవరి 20 : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సిగ్గులేని దద్దమ్మల్లా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్తో కలిసి గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ నాయకులు రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ నియోజక వర్గాలను కైవసం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు రెండు మూడు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయన్నారు. అసలు ఎస్సీ, ఎస్టీలకు ఏమి చేశారని ఓట్లు అడుగుతున్నారని బీజేపీని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో అణగారిన వర్గాల అభివృద్ధికి చేసింది ఏమీలేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు అందకుండా రిజర్వేషన్లు ఎత్తివేయాలనే బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తుందని మండిపడ్డారు. నవరత్నాలు, లాభసాటిగా నడుస్తున్న పరిశ్రమలను అమ్మేస్తున్నారన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బీజేపీకి దూరంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రాష్ర్టాల్లో ఆ పార్టీని ఓడిస్తున్నారని, రేపు జరుగనున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కూడా ఘోరంగా ఓడిపోతుందన్నారు.
ఉత్తరప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అఖిలేశ్యాదవ్కు మద్దతు తెలుపుతున్నారని వివరించారు. పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ 3వ స్థానంలో నిలుస్తుందని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ కుదించుకుపోతుందని కడియం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని బీజేపీ కలలుగంటూ భ్రమపడుతుందని.. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మేడా రం సమ్మక్క-సారలమ్మ ఆదివాసీ జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు తెచ్చేలా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే పక్కన పెట్టిందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని అమలు చేయని బీజేపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగులో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఈ రోజు వరకు బిల్లు పెట్టలేదన్నారు.
బండి సంజయ్వి అవగాహన లేని మాటలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పోడు భూములపై పోరాటం చేస్తామంటున్నాడని, అసలు అట వీ చట్టాలపై అధికారం కేంద్రానికే ఉంటుందనే కనీస జ్ఞానం లేకుండా అవగాహన రాహిత్యంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. దమ్ముంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని కడియం శ్రీహరి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే ఇప్పటికైనా విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంతో పాటు గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పి, కాళేశ్వరం, పాలమూరు, మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కడియం శ్రీహరి డిమాం డ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. హుజూరాబాద్లో గెలిచామనే భ్రమలో బీజేపీ నాయకులు ఉన్నారని, వారు ఊహించినట్లు తెలంగాణలో ఫలితాలు అలా ఉండవని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పడంతో పాటు బీజేపీకి సమాధి కట్టం ఖాయమని కడియం శ్రీహరి పేర్కొన్నారు.