హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 3 : విద్యార్థుల మదిలో మెదిలే సరికొత్త ఆలోచనల నుంచి పురుడుపోసుకునే కొంగొత్త ఆవిష్కరణలకు కే-హబ్(కాకతీయ హబ్) సిద్ధమవుతోంది. వారు అంకుర సంస్థలను స్థాపించేందుకు అవసరమైన ప్రయోగశాలలు, పరిశోధన కేంద్రాలు తదితర సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా తీర్చిదిద్దే లక్ష్యంగా కేయూలో ఏర్పాటవుతోంది. ఇందుకోసం ‘రుసా’ కింద రూ.50కోట్లు మంజూరు కాగా ఇప్పటికే ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, కెరీర్ హబ్ల నిర్మాణం పూర్తయింది. త్వరలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా నూతన ఆవిష్కరణలు, ప్రయోగశాలలు, పరిశోధనలకు అడ్డాగా మారనుంది.
నూతన ఆవిష్కరణలతో స్టార్టప్ కంపెనీలు స్థాపించేలా అవకాశాలు కల్పించేందుకు గాను కాకతీయ విశ్వవిద్యాలయంలో కే-హబ్ ఏర్పాటవుతోంది. కేయూలో కే-హబ్(కాకతీయ హబ్) స్థాపనకు సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విద్యార్థుల కోసం ప్రయోగశాలలు, పరిశోధనా కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.50 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రుసా) కింద హబ్కు నిధులు మంజూరు చేశారు. ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇంక్యుబేషన్, కెరీర్ హబ్ల(కే-హబ్) నిర్మాణం పూర్తికావడంతో త్వరలో భవన ప్రారంభోత్సవానికి వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ల్యాబ్లు, పరిశోధనా కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం కే-హబ్ లక్ష్యం.
రూ.50 కోట్లతో కే-హబ్
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాఅభియాన్(రుసా) కింద రూ.50 కోట్లు నిధులు కేటాయించారు. ఇందులో పరిశోధనల కోసం రూ.35 లక్షలు, బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.15లక్షలు వినియోగించనున్నారు. ఇప్పటికే రూ.4.50 కోట్లతో భవనం పూర్తి కాగా రూ.1.50 లక్షలతో కంప్యూటర్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలు చేయనున్నారు. 19,733 చదరపు అడుగుల్లో మూడు అంతస్థుల భవనం నిర్మించారు. కే-హబ్ ఏర్పాటులో భాగంగా ఫేజ్-1 కింద రూ.6 కోట్లతో అత్యాధునిక భవనం నిర్మిస్తున్నారు. ఈ ఇంక్యుబేషన్ సెంటర్, కే-హబ్ అని పిలువబడే కాకతీయ హబ్కు త్వరలో ల్యాబ్ల కోసం పరికరాలు రానున్నాయి. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అందించనున్నాయి.
నూతన ఆవిష్కరణలకు కేంద్రం..
త్వరలో కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించనున్న కే-హబ్ నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారనుంది. ఆలోచనలు ఉన్న ప్రతి విద్యార్థి ఇక్కడికి వచ్చి ఆవిష్కరణతో వెళ్లేందుకు కే-హబ్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థులు కొత్త ఆలోచనలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
నాలుగు పరిశోధన కేంద్రాలు
పరిశోధనలు, నాణ్యత మెరుగుదలకు..
కే-హబ్ ద్వారా విద్యార్థులకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి వారికి నైపుణ్య, అభివృద్ధి కార్యక్రమాలను అందించనున్నారు. అలాగే పరిశోధనలు, నాణ్యత మెరుగుపడేలా ఉపయోగపడుతుంది. కే-హబ్ ప్రారంభమైన తర్వాత విద్యార్థులను ప్రోత్సహించడానికి టీ-హబ్తో చేతులు కలపాలని అధికారులు యోచిస్తున్నారు. నమూనాలు, ైస్లెడ్లు మొదలైన వాటితో కూడిన సైన్స్ మ్యూజియం, మాన్యుస్క్రిప్ట్లు, కళాఖండాలు, గ్రానైట్ శిల్పాలు మొదలైన వాటితో చరిత్ర మ్యూజియం కూడా ఏర్పాటుచేయనున్నారు.
అనేక స్టార్టప్ కంపెనీలకు వసతి..
ఫార్మాస్యూటికల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), బయోడైవర్సిటీ రక్షణ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, జియోలాజికల్ సైన్స్, మైనింగ్, ఇతర రంగాల్లో పరిశోధనలు నిర్వహించనున్నారు. అసాధారణమైన, విశిష్ఠమైన పరిశోధన అవుట్పుట్ కోసం పేటెంట్లు పొందేందుకు ఈ కేంద్రం కోసం వివిధ ఏజెన్సీల నుంచి నిధులను పొందేందుకు కమిటీలు పనిచేస్తాయి. కే-హబ్లో అనేక స్టార్టప్ కంపెనీలకు వసతి కల్పిస్తారు. ఇవేకాకుండా ఇంకా ఎన్నో విభాగాలకు సంబంధించిన పరిశోధనలు చేసి నూతన ఆవిష్కరణల కోసం విద్యార్థులకు కావాల్సినవి ఇక్కడ సమకూర్చుతారు.
ఆవిష్కరణలు, పరిశోధనల వేదిక
కే-హబ్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు వేదిక కాబోతోంది. పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పొందేందుకు, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు, నైపుణ్య, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా ఉంటుంది. రూ.50 కోట్ల రుసా నిధులతో దీనిని ఏర్పాటు చేస్తున్నాం. కే-హబ్ కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులను ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగపడనుంది.
– ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కేయూ వైస్ ఛాన్సలర్