వరంగల్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ప్రత్యేకంగా కొత్తవేమీ మంజూరు కాలేదు. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ములుగు, నర్సంపేటలో మెడికల్ కాలేజీ పనులను పూర్తి చేస్తామని, నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో రైతు భరోసా, రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు భృతి, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనేది స్పష్టంగా చెప్పలేదు. వరంగల్ జిల్లాలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన దేశంలోనే అతి పెద్ద వస్త్ర ఉత్పత్తి కేంద్రంగా ఉండే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు ప్రధానమంత్రి మిత్ర పథకంతో అనుసంధానం చేసి పూర్తి చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా రెండు లెదర్ పార్కులను ఏర్పాటు చేస్తామని ప్రస్తావించినా కచ్చితంగా ఎక్కడ అనేది స్పష్టం చేయలేదు. గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో రెండు ఎంబీఏ కాలేజీలను ప్రారంభించనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ఏ జిల్లాలో వీటిని ఏర్పాటు చేస్తారనే విషయాన్ని ప్రస్తావించలేదు.
ప్రతి మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ఏర్పాట్ల కోసం రూ.110 కోట్లు విడుదల చేసినట్లు బడ్జెట్లో ప్రస్తావించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి శాఖకు సంబంధించి శ్రీరాంసాగర్ వరద కాలువ, దేవాదుల, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యువతకు ఉపాధి కల్పన అవకాశాలు పెంచేందుకు వీలుగా ప్రభుత్వ ఐటీఐలను ప్రైవేటు సంస్థలతో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐటీఐలకు ఇది ఉపయోగపడనున్నది. కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ నగరంలో చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను, ములుగు, నర్సంపేటలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల పనులను పూర్తి చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది.
కేటాయింపులు తక్కువే
పోచమ్మమైదాన్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గృహ నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రస్తావన రాలేదు. విద్య, ఉద్యోగాల కల్పన, పరిశ్రమలకు ప్రోత్సాహకం కోసం అధిక నిధుల కేటాయించాల్సి ఉండేది. నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పనకు అధిక నిధులు కేటాయించాలి. వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్, విద్యా రంగాలకు అధిక మొత్తంలో కేటాయింపులు ఉంటే ఆమోదయోగ్యంగా ఉండేది.
– త్రిపురనేని గోపీచంద్, చార్టెర్డ్ అకౌంటెంట్
దివ్యాంగులపై చిన్నచూపు
జనగామ(నమస్తే తెలంగాణ) : ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి నిధుల ప్రస్తావనే లేదు. రూ.2,75,891కోట్ల బడ్జెట్లో పైసా కేటాయించలే. 2016 దివ్యాంగుల హకుల పరిరక్షణ చట్టం ప్రకారం బడ్జెట్లో 5 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. ఆ లెక్కన బడ్జెట్లో రూ.13,794.55 కోట్లు పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెపుతున్న ఆసరా పింఛన్లకు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు?, డిసెంబర్ నుంచే పెంచిన పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి బడ్జెట్లో మొండిచెయ్యి చూపారు. రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్న దివ్యాంగుల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే దానికి బడ్జెట్ ప్రసంగమే సాక్ష్యం. ప్రజాపాలనలో ఆసరా పింఛన్ల కోసం 24 లక్షల దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని, బడ్జెట్లో ఒక్క రూపా యి ఇవ్వకుండా ఎలా మంజూరు చేస్తారో చెప్పలేదు. అంగన్ వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందిస్తామని చెప్పిన దానికీ అతీగతీ లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలి.
– తల్లి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు శంకర్, యాదగిరి
పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం
శాయంపేట: ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉద్యోగుల పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే పీఆర్సీ అమలు చేస్తామని చెప్పినా బడ్జెట్లో దాని ఊసే లేదు. బడ్జెట్లో నిధులు కేటాయించి ఈ ఆర్థిక సంవత్సరం పీఆర్సీ అమలు చేయాలి. అయితే విద్యారంగానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు పెంచడం హర్షణీయం. ప్రతి మండ లానికి తెలంగాణ పబ్లిక్ సూల్ ఏర్పాటుతో విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. గురుకుల భవనాలకు నిధులు కేటాయించడం సానుకూల అంశం.
– రాజు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
విద్యారంగానికి అన్యాయం
బయ్యారం: బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం జరిగింది. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలంటే బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలి. ప్రస్తుత రూ. 2.75 లక్షల కోట్ల బడ్జెట్లో రూ. 21, 300 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయం. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కామన్ సూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలి.
– గంగావత్ శ్రీనివాస్నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి