ఏటూరునాగారం, జూలై 16 : లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో కొట్టుమిట్టాడుతున్నాయి. రామన్నగూడెం, రాంగనర్, లంబాడీతండా, ఏటూరునాగారంలో ఎస్సీ కాలనీ, నందమూరి నగర్, జడ్పీ హైస్కూల్ ప్రాంతం నీటిలోనే ఉన్నాయి. ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వెళ్లే రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. లంబాడీతండా, రాంనగర్వాసులు ఏటూరునాగారం పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్రూం ఇండ్లు నీటిలో మునిగి పోయాయి.
విద్యుత్ పునరుద్ధరణ పనులు
మూడు రోజులుగా అంధకారంలో ఉన్న ఏటూరునాగారంలో ఎస్సీ కాలనీ మినహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. గోదావరి వరదలో ఉన్న విద్యుత్ స్తంభాల వద్దకు కొండ సమ్మయ్య, అమర్ జేసీబీపై వెళ్లి విద్యుత్ సరఫరా పనులు పునరుద్దరించారు.
గోదావరి తగ్గుముఖం
వాజేడు : మండలంలోని పేరూరు వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. దూలపురం, సుందరయ్య కాలనీ, గుమ్మడిదొడ్డి, చీకుపల్లి గ్రామాల్లో వరద తగ్గుముఖం పట్టడంతో రవాణా సౌకర్యం కల్పించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కలు వాడిపోయాయి. దూలపురంలో బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఇప్పగూడెం గ్రామంలో వైద్యాధికారి మంకిడి వెంకటేశ్వర్రావు, మహేందర్, శాంతిశౌర్య, హెల్త్సూపర్వైజర్ కోటిరెడ్డి పడవలో వెళ్లి వైద్యశిబిరం నిర్వహించారు. టేకులగూడేనికి చెందిన గర్భిణి అట్టం రజితను తహసీల్దార్ లక్ష్మణ్ పడవలో వాజేడు పీహెచ్సీకి తరలించారు.
కన్నాయిగూడెంలో..
కన్నాయిగూడెం: మండలంలోని పలు ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ద్ధరణ పనులను ఆ శాఖ అధికారులు శనివారం చేపట్టారు. కంతనపల్లి, ఏటూరునాగారం గ్రామాల మధ్య గోదావరిలో మునిగిన వైర్లు, స్తంభాలు, కాసారాలపై ఉన్న చెట్టు కొమ్మలు, చెత్తను పడవలపై వెళ్లి తొలగించారు. ఈ సందర్భంగా ఏఈ తిరుపతి, లైన్మెన్, సిబ్బందిని మండల ప్రజలు అభినందించారు.
వైద్య శిబిరాలు
అధిక వర్షాలు, వరదలతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యుడు అల్లి నవీన్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. డెంగీ, మలేరియా నుంచి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హెల్త్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, ఓంప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు.