శ్రీనివాస్రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేసిన వరంగల్ కలెక్టర్
పాల్గొన్న మంత్రి, ప్రభుత్వ చీఫ్విప్, జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ ముఖ్యనేతలు
శుభాకాంక్షల వెల్లువ.., శాలువాలతో సన్మానం
ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
కలిసికట్టుగా అభివృద్ధి చేస్తాం : మంత్రి సత్యవతిరాథోడ్
అన్నిరంగాల్లో వరంగల్ అభివృద్ధి: ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు : ఎమ్మెల్సీ పోచంపల్లి
వరంగల్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఓరుగల్లులో టీఆర్ఎస్ మరోమారు విజయబావుటా ఎగురవేసింది. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలో నిలిచిన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శుక్రవారం ఎన్నికల అధికారులు ప్రకటించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గోపీ ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు పెద్దఎత్తున సంబురాలు జరుపుకున్నారు. మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎంపీలు దయాకర్, కవిత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పోచంపల్లికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పూలదండలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. తనకు రెండోసారి అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ బీ గోపి ధ్రువీకరణ పత్రం అందజేశారు. రాష్ట్ర మంత్రులు, జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్ద రిజిస్టర్లో సంతకం చేశారు. హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ స్థానిక సంస్థల స్థానం నుంచి 2019 జూన్లో జరిగిన ఉపఎన్నికల్లో రికార్డుస్థాయి మెజారిటీతో గెలుపొందారు. వరుసగా రెండోసారి ఇదే స్థానం నుంచి ఆయన టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, స్టేషన్ఘన్పూర్, డోర్నకల్, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, జనగామ ఎమ్మెల్యేలు టీ రాజయ్య, డీఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్, ములుగు, జనగామ జడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, కుసుమ జగదీశ్వర్, పీ సంపత్రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఎం రవీందర్రావు, మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నవీన్రావు, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, వరంగల్ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గుంటి రజిని, టీఆర్ఎస్ ముఖ్యనేతలు జీ కేశవరావు, సతీశ్రెడ్డి, వంశీధర్రెడ్డి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సోదా రామకృష్ణ, బొల్లె భిక్షపతి, జడ్పీటీసీలు జీ సదయ్య, తిరుపతిరెడ్డితోపాటు ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ల చైర్మన్లు, సర్పంచ్లు, పార్టీ ముఖ్యనేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు, పోచంపల్లి అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
శుభాకాంక్షలు.. సంబురాలు
ధ్రువీకరణపత్రంతో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి బయటకు రాగానే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛాలు అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలో పోచంపల్లిని పూలదండలతో ముంచెత్తారు. మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్ ఎదుట మెయిన్ రోడ్డుపై టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పటాకలు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచారు. ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా ఈ సంబురాల్లో పాల్గొన్నారు.
అభివృద్ధికి తోడ్పడుతా : ఎమ్మెల్సీ పోచంపల్లి
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి తోడ్పడుతానని, ఇక్కడి 11మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధిలో భాగస్వామినవుతానన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం బడ్జెట్లో కేటాయించిన రూ.500 కోట్లను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసేలా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తనకు రెండోసారి అవకాశం కల్పించినందుకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
టీఆర్ఎస్ బలం తెలుస్తుంది: మంత్రి సత్యవతిరాథోడ్
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో రాష్ట్రంలో టీఆర్ఎస్ బలమేమిటో తెలుస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడిన అనంతరం కలెక్టరేట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా టీఆర్ఎస్ ఇప్పటికే ఆరు స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకున్నదని, మరో ఆరింటిలో సునాయాసంగా గెలువబోతున్నదని తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ప్రేమ ఉందని, జిల్లా సమగ్రాభివృద్ధికి ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. అందరం కలిసి ఐక్యతగా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందేలా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి తమతో కలిసి అభివృద్ధికి సహకరిస్తారన్నారు. శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.