Crime news : కొడుకు ద్వారా తనకు ప్రమాదం ఉందని జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి.. ఓ తండ్రి కన్నబిడ్డను చంపి నదిలో పడేసిన దారుణ ఘటన తమిళనాడు (Tamil Nadu) లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తేని నగరం (Theni City) లోని ఎంజీఆర్నగర్కు చెందిన 50 ఏళ్ల వేందర్ బాలా (Vendar Bala) ‘తమిళగ మక్కళ్ మున్నేట్ర కళగం (TMMK)’ పార్టీ నాయకుడు. అతని మొదటి భార్య రాజలక్ష్మి (Rajalaxmi) కుమారుడు అయిన 20 ఏళ్ల శ్రీకాంత్ (Srikanth) ఆస్తి విషయంలో తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు కనిపించకుండా పోయాడు.
దాంతో 2023 సెప్టెంబర్లో శ్రీకాంత్ అదృశ్యమయ్యాడని తల్లి రాజలక్ష్మి మదురై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. కోర్టు ఆదేశాలతో 2026 ఫిబ్రవరిలో ఈ కేసు దర్యాప్తు సీబీసీఐడీకి బదిలీ అయింది. శ్రీకాంత్కు, తేనికి చెందిన అలెక్స్పాండియన్ అనే వ్యక్తికి మధ్య పాతకక్షలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. దాంతో పోలీసులు అలెక్స్పాండియన్ను అరెస్టు చేసి విచారించారు. దాంతో అతను.. తాను, శ్రీకాంత్ తండ్రి వేందర్ బాలా, ముల్లైనగర్కు చెందిన కరుప్పయ్య కలిసి హత్య చేసినట్లు అంగీకరించాడు.
హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి ముల్లైపెరియార్ నదిలో పడేసినట్లు తెలిపాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు వేందర్ బాలాను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దాంతో అతడు.. ఓ జ్యోతిష్యుడి వద్ద జాతకం చూపించుకోగా కుమారుడితో తనకు ప్రమాదం ఉందని చెప్పాడని, అందుకే స్నేహితుడు కరుప్పయ్య సాయంతో శ్రీకాంత్ని గొంతు నులిమి హత్యచేసినట్లు అంగీకరించాడు. కరుప్పయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.