ములుగు, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం జరగనున్నది. జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో విశాలమైన స్థలంలో పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు సర్వాంగ సుందరంగా భవనాన్ని నిర్మించారు. నేడు దసరా పర్వదినం సందర్భంగా ప్రారంభోత్సవానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఉదయం 11 గంటలకు పార్టీ జిల్లా అధ్యక్షుడితోపాటు జడ్పీ చైర్పర్సన్, ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, రోడ్లు, భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్తో కలిసి ప్రారంభించనున్నారు.
జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సోమవారం జరగనుంది. ఇదేరోజు దసరా కావడంతో పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో జరుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డులో విశాలమైన స్థలంలో పార్టీ కార్యకలాపాలకు అవసరమైన సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా కార్యాలయాన్ని నిర్మించగా సోమవారం ప్రారంభించనున్నారు. ఇందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్తో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని పరిపాలిస్తున్నారు. దేశంలో ఏ పార్టీకి లేని సంఖ్యలో సభ్యత్వాలతో పార్టీని అత్యంత బలోపేతం చేశారు. అందులో భాగంగానే ప్రతి జిల్లాకు పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ములుగు జిల్లా 2019లో ఏర్పడగా ఆగస్టులో బండారుపల్లి రోడ్డులోని ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, పార్టీ ద్వారా భవన నిర్మాణానికి నిధులను కేటాయించారు. వాస్తు నిపుణులతో భవన నిర్మాణ పనులను ప్రారంభించి నాణ్యతతో నిర్మింపజేశారు. పనులు పూర్తయినప్పటికీ కొంతకాలంగా అనివార్యకారణాల వల్ల ప్రారంభోత్సవం చేయలేదు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణతోపాటు కార్యకర్తల సౌకర్యార్థం దసరా పండుగ సందర్భంగా కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు.
రెండు ఎకరాల స్థలంలో..
జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని సువిశాల స్థలంలో నిర్మించారు. ఇందుకు రెండు ఎకరాలు కేటాయించగా, సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు మీటింగ్ హాల్, చుట్టూ ప్రహరీని నిర్మించారు. సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పార్టీ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు, జడ్పీ చైర్పర్సన్, ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్రెడ్డి, రోడ్లు, భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కలిసి ప్రారంభించనున్నారు. పార్టీ జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పీఏసీఎస్ చైర్మన్లు, వార్డు సభ్యులు, అధికార ప్రతినిధులు, మండల ఇన్చార్జిలు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.