జయశంకర్ భూపాలపల్లి : వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రైతులు ఘన సత్కారం చేసినా బుద్ధి రావడం లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో రేవంత్రెడ్డిపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి రైతులకు నాణ్యమైన 24 గంటలు ఉచిత కరెంటు అందిస్తూ రైతులకు అండగా నిలిచిందన్నారు. చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్ రేవంత్ రెడ్డి అని.. అక్కడ చంద్రబాబు ఏది చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తున్నాడని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతు బీమా, 24 గంటలు ఉచిత కరెంటు ఇలా అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేయడంతో.. రైతుల వద్దకు ఏం ముఖం పెట్టుకొని పోవాలో అర్థం కాక రేవంత్ రెడ్డి వంటి నాయకుడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సభ్యత సంస్కారం లేకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు.