జయశంకర్ భూపాలపల్లి : పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ నూతన కార్యాలయం, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్, పంచాయతీరాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలను ఎమ్మెల్యే గండ్ర ప్రారంభించారు. అనంతరం జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి ఎస్.దిలీప్ కుమార్ను తన సీటులో కూర్చోబెట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా కేంద్రానికి జిల్లా పంచాయతీరాజ్ శాఖ కార్యాలయం, ఉప కార్యనిర్వాహక కార్యాలయం, పంచాయతీ రాజ్ విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం కార్యాలయాలు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పంచాయతీరాజ్ జిల్లా కార్యాలయంతో జిల్లాకు అన్ని కార్యాలయాలు పూర్తిస్థాయిలో వచ్చాయన్నారు. కాగా, కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కానటువంటి ఏఈ లపై అగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.