ఇంకా మొదలుకాని వైకుంఠధామం నిర్మాణం
నిధులు కేటాయించినా నిర్లక్ష్యం
అసంపూర్తిగానే సెగ్రిగేషన్ షెడ్డు
ఊరికి దూరంగా పల్లె ప్రకృతి వనం
కనిపించని వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట వస్తువులు
కురవి, మార్చి 19: పట్టణాలకు దీటుగా పల్లెలు మెరువాలని సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పల్లెప్రగతి లక్ష్యం, కొందరు అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల పట్టింపులేని తనంతో నెరవేరడం లేదు. కురవి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న లింగ్యాతండాలో పల్లె ప్రగతి తీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇంతకుముందు కురవికి అనుబంధంగా లింగ్యాతండా ఉండేది. 500జనాభా ఉన్న తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఇస్లావత్తండా, బానోత్ తండా, మూడుగుడిసెల తండాను కలుపుకొని 581 జనాభాతో 210 ఇండ్లతో లింగ్యాతండా కొత్త పంచాయతీగా అవతరించింది.
మొదలుకాని వైకుంఠధామం పనులు
చివరి మజిలీకి చింత ఉండొద్దనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో వైకుంఠధామానికి రూ. 12లక్షల నిధులు కేటాయించి అన్ని హంగులతో నిర్మించాలని ఆదేశించింది. లింగ్యాతండాలో కురవి పెద్దశివారు శిఖంలో నిర్మించ తలపెట్టిన వైకుంఠధామం పనులు గుంతల వద్దనే ఆగిపోయాయి. డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం అన్నీ ఒకే ప్రదేశంలో నిర్మించాలని నిర్ణయించారు. వాటి పనులన్నీ అసంపూర్తిగానే మిగిలాయి.
ఉపయోగం లేని పార్కు
పల్లె ప్రజలు ప్రకృతిని ఆస్వాదించేందుకు విలేజ్ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా, లింగ్యాతండాతో మొక్కుబడిగా పల్లె ప్రకృతి వన్నాన్ని ఏర్పాటు చేశారు. ఊరికి దూరంగా ఉండడంతో అది ఎవరికీ ఉపయోగం లేకుండా పోతున్నది. కనీసం అక్కడ వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు సైం ఏర్పాటు చేయలేదు.
కాల్వ నీటివల్ల పనులు ఆగినయ్
లచ్చిరాం తండా వద్ద భూమిని రెవెన్యూ అధికారులు చూపినా తండావాసులు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. వైకుంఠధామం పనులు మొదలుపెట్టే సమయానికి కాల్వ నీరు రావడంతో ఆగిపోయాయి. పల్లెప్రకృతి వనం ఊరికి దూరంగా ఉన్న మాట వాస్తవం. దానికి ప్రత్యామ్నాయంగా ఊరికి దగ్గరనే వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు వస్తువులు ఏర్పాటు చేస్తాం.