వరంగల్ రూరల్ జిల్లాలో గణనీయంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి
815 చెరువులు, రిజర్వాయర్లలో ఉచిత చేప పిల్లల విడుదల
ప్రయోగాత్మకంగా మూడు చెరువుల్లోరొయ్య పిల్లల పెంపకం
17,550 మందికి లబ్ధి : మత్స్యశాఖ జిల్లా అధికారి
వరంగల్ రూరల్, మే 26 (నమస్తే తెలంగాణ) తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ సత్ఫలితాలు ఇస్తున్నది. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతున్నది. రిజర్వాయర్లు, చెరువుల్లో పోసి న చేప పిల్లలు, రొయ్యలు పెరిగి పెద్దవికాగా, వాటిని పట్టి మార్కెట్కు తరలించి ఉపాధి పొందుతున్నారు. ఇప్పటికే జిల్లాలో సుమారు 9వేల మెట్రిక్ టన్నుల చేపలు, 250 మెట్రిక్ టన్నుల రొయ్యల ఉత్పత్తి జరిగినట్లు మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో మత్స్య సహకార సంఘాల్లోని సభ్యుల్లో ఒక్కొక్కరికి సగటున ఈ ఏడాది రూ.35వేల ఆదాయం సమకూరినట్లు ప్రకటించారు. ఉచిత చేపపిల్లల సరఫరాలో వరుసగా నాలుగేళ్ల నుంచి జిల్లా రాష్ట్రంలో అగ్రభాగాన నిలుస్తున్నది. ఈ ఏడాది గత వానకాలం మత్స్యశాఖ అధికారులు జిల్లాలోని 815 రిజర్వాయర్లు, చెరువుల్లో 2.41 కోట్ల చేప పిల్లలను వదిలారు. ఇందులో రాయపర్తి మండలంలోని మైలారం, శాయంపేట మండలంలోని చలివాగు ప్రాజెక్టు రిజర్వాయర్లు కాగా, మిగతా 813 చెరువులే. వీటిలో బొచ్చె, రవ్వు, బంగారుతీగ, మెరిగె రకాల చేప పిల్లలు పోశారు. వీటి విలువ రూ.1.22కోట్లు. వందశాతం సబ్సిడీపై ప్రభుత్వం ఈ నిధులు ఇచ్చింది.
లక్ష్యం 9,358 మెట్రిక్ టన్నులు..
జిల్లాలోని 815 రిజర్వాయర్లు, చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై వదిలిన చేప పిల్లల ద్వారా ఈ ఏడాది సుమారు 9,358 మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి సాధించాలని లక్ష్యం కాగా, ఇప్పటికే జిల్లాలో దాదాపు 9వేల మెట్రిక్ ట న్నుల చేపల ఉత్పత్తి జరిగినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి నరేశ్కుమార్ చెప్పారు. రిజర్వాయర్, చెరువుల్లో పట్టిన చేపలను మత్స్యకారులు స్థానిక, వివిధ ప్రాంతాల్లోని మా ర్కెట్లలో విక్రయిస్తున్నారు. మహిళా మత్స్య సహకార సం ఘాల్లోని సభ్యులు సహా జిల్లాలో సభ్యత్వం గల మత్స్యకారులు 17,550 మంది ఉన్నారని, పెద్ద చెరువుల్లో నీళ్లు పుష్కలంగా ఉండడంతో చేపలు పట్టడం ఈసారి కొంత ఆలస్యంగా మొదలైనట్లు చెప్పారు. రిజర్వాయర్లు, పెద్ద చెరువుల్లో ఇంకా చేపలు పట్టాల్సిఉందని, చిన్న చెరువుల్లో పూర్తయినట్లు తెలిపారు. చేపల ఉత్పత్తి సుమారు 10,500 మెట్రిక్ టన్నుల చేరే అవకాశం ఉందన్నారు.
లక్ష్యానికి మించి రొయ్యలు..
జిల్లాలో గత వానకాలం ప్రయోగాత్మకంగా కొన్ని చెరువుల్లో నూరు శాతం సబ్సిడీపై వదిలిన రొయ్య పిల్లల ద్వారా ఉత్పత్తి లక్ష్యాన్ని మించడడం విశేషం. తొలిసారి జిల్లాలో మైలారం రిజర్వాయర్లో 2.28లక్షలు, సంగెం మండలంలోని ఎల్గూర్రంగంపేట పెద్ద చెరువులో 1.13, నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో 1.14 లక్షల రొయ్య పిల్లలను ఉచితంగా వదిలారు. 4.45 లక్షల రొయ్య పిల్లల ద్వారా 240 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మూడు చెరువుల్లో ఇటీవలికాలంగా మత్స్యకారులు రొయ్యలను పట్టారు. ఇప్పటికే 242 మెట్రిక్ టన్నుల రొయ్యల ఉత్పత్తి జరిగినట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి వెల్లడించారు. ఈ ఏడాది ఉచిత చేప, రొయ్య పిల్లల సరఫరాతో సాధించిన ఉత్పత్తి వల్ల జిల్లాలోని మత్స్యసహకార సంఘాల్లోని సభ్యులకు ఒక్కొకరికి ఇప్పటికే సగటున రూ.35 వేల వార్షిక ఆదా యం సమకూరినట్లు నరేశ్కుమార్ ప్రకటించారు. రానున్న వానకాలం కోసం జిల్లాలోని మత్స్యకారులకు నూరుశాతం సబ్సిడీపై చేప, రొయ్య పిల్లలను సరఫరా చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.