ఉమ్మడి జిల్లాలో 46,814మంది ఉత్తీర్ణులు
ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా గ్రేడింగ్
నెల్లికుదురు, మే 21 : పదో తరగతి ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. కరోనా వ్యాప్తిస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక పరీక్షలు నిర్వహించకుండా ఎఫ్ఏ-1 మార్కుల ఆధారంగా ఫలితాలను ప్రకటించింది. ఆరు జిల్లాల వ్యాప్తంగా మొత్తం 46,814 మంది విద్యార్థులకు గాను అందరినీ ఉత్తీర్ణులను చేసింది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా వరుసగా రెండోసారి పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ఫలితాలు ప్రకటించింది. 2019-20 విద్యా సంవత్సరంలో మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా తెలుగు, హిందీ పరీక్షలు ముగిసిన తర్వాత వైరస్ కారణంగా వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ ప్రారంభంలో నిర్వహించాలని భావించి గదికి 12 మంది చొప్పున కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. కానీ వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగడం వల్ల పూర్తిగా రద్దు చేసి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు. అలాగే 2020-21 విద్యా సంవత్సరాన్ని కూడా కరోనా వెంటాడింది.
విద్యార్థులు నష్టపోవద్దని భావించిన ప్రభుత్వం ఆన్లైన్ తరగతులు నిర్వహించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫిబ్రవరి -2021లో కొద్దిరోజులు 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధనకు అవకాశమిచ్చినా వైరస్ కారణంగా ముందుకుసాగలేదు. దీంతో ప్రత్యక్ష తరగతులు ఆపేసి మళ్లీ ఆన్లైన్ తరగతులనే కొనసాగించింది. ఈ నేపథ్యంలో పరీక్ష ఫీజు చెల్లించిన వారందరినీ ఉత్తీర్ణులను చేస్తూ ఎఫ్ఏ-1 మార్కుల ప్రాతిపదికన గ్రేడింగ్ నిర్ణయించి ఫలితాలు ప్రకటించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో శుక్రవారం ప్రకటించిన 10 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 46,814 మంది విద్యార్ధులకు గాను అందరూ ఉత్తీర్ణత సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో 8,950 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 3,899 మంది, వరంగల్ రూరల్లో 7,357 మంది, వరంగల్ అర్బన్లో 15,739 మంది, జనగామలో 7,338 మంది, ములుగులో 3,331 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.