భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులతో సమీక్ష
భూపాలపల్లి రూరల్, మే 27 : జనాభా, సామాజిక, ఆర్థిక గణన వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ అధికారులకు ల్యాప్ టాప్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనాభా వివరాలు, సహజ వనరుల లభ్యత, వ్యవసాయం, ప్రభుత్వ పథకాల అమలు తదితర వివరాలను పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. మండల ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు చురుగ్గా వ్యవహరించి ఆయా మండలాల వారీగా ప్రభుత్వ కార్యక్రమాల ప్రగతి, వర్షపాతం, పంటల విస్తీర్ణం, దిగుబడి, జనాభా వివరాలను ఎప్పటికప్పుడు క్రోడీకరించి, జిల్లా అధికారులకు అం దించాలని సూచించారు. సమాచారాన్ని సమర్థవంతంగా పొందుపరచడానికి నూతనంగా ప్రణాళికా శాఖ తరఫున ప్రతి మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ అధికారికి ఒకటి చొప్పున ల్యాప్టాప్లను అందిస్తున్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన డేటాను ల్యాప్ టాప్ల ద్వారా స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళికా అధికారి కే సామ్యూల్, స్టాటిస్టికల్ అధికారి రత్నమాల, డిప్యూటీ స్టాటిస్టికల్ అధికారి సాంబయ్య, మండల అధికారులు పాల్గొన్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
టేకుమట్ల : కరోనా కట్టడిలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉం టూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులతో కరోనా నిర్మూలన కోసం చేపడుతున్న పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవిడ్ టెస్ట్లు, కిట్ల గురించి ఆరా తీశారు. జ్వర సర్వే తీరును అడిగి తెలసుకున్నారు. లక్షణాలున్న వారికి మందులు ఇవ్వాలని, వారు బయటకు రాకుండా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ ఇచ్చే అంశాలపై చర్చించారు. రోజూ గ్రామాల్లో శానిటైజేషన్ చేయించాలని మండల పంచాయతీ అధికారిని ఆదేశించారు. దీంతో వెంటనే అన్ని గ్రామాల్లో సర్పంచ్లు, కార్యదర్శులు శానిటేషన్ పనులు చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీడీవో చండీరాణి, తహసీల్దార్ రవీందర్, ఎంపీవో విక్రమ్, డాక్టర్లు రవి, రాజు, సంపత్, ఈసీ రాము, రాజేందర్రెడ్డి పాల్గొన్నారు.