కొత్త ఏడాది నుంచి అందుబాటులోకి..
జిల్లాలో 355 రేషన్ దుకాణాలు
లబ్ధిదారులకు పారదర్శకంగా సేవలు.. డీలర్లకు ప్రత్యేక శిక్షణ
జనగామ, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ) :ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న సర్కారు త్వరలో టీ-వాలెట్ విధానాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం చౌకధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ రూపొందించింది. జిల్లాలో 355 రేషన్షాపులున్నాయి. 1,65,744 తెల్లకార్డుదారులకు బియ్యం, కిరోసిన్, చక్కెర పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకే లబ్ధిదారులకు వీటిని అందజేస్తున్నారు. టీ-వాలెట్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరెంటు బిల్లు, ఇంటిపన్ను, రైల్వే, బస్ టికెట్ల బుకింగ్, మొబైల్ రీచార్జ్, డీటీహెచ్ బిల్లు, ట్రాఫిక్ చలాన చెల్లింపుతోపాటు వివిధ పోటీ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు డీలర్లకు సైతం ఆదాయం పెరగనుంది.
గ్రామీణ ప్రాంత ప్రజల్లో అక్షరాస్యతను పెంచి ‘డిజిటల్ ఇండియా’లో భాగస్వాములను చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అనేక వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టి పౌరసరఫరాలశాఖ ద్వారా డిజిటల్ సేవలను అమలు చేస్తున్నది. ఇక రేషన్ దుకాణాల్లో కొత్త ఏడాది నుంచి టీ-వాలెట్ సేవలను తీసుకురానుంది. నిత్యావసర సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ దుకాణాల్లో ఇప్పటికే ఈ-పాస్ విధానాన్ని ప్ర భుత్వం అమలు చేస్తున్నది. ఈ విధానం ద్వారా లబ్ధిదారుడి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా స్వ యంగా దుకాణానికి వచ్చి వేలిముద్ర, ఓటీపీ విధానం ద్వారా బియ్యం, ఇతర వస్తువులు తీసుకుంటున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకంగా ఉన్న రేషన్ దుకాణాల్లో మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి టీ-వాలెట్ ద్వారా ఈ-సేవ కేంద్రాల్లో లభించే అన్ని రకాల సేవలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన అధికారులు రేషన్ డీలర్లకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం జిల్లాలో 355 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, కిరోసిన్, చక్కెరను 1,65,744 మంది రేషన్కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతినెలా 1 నుంచి 15వ తేదీ వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచుతున్నారు. ఇకపై 30 రోజుల పాటు వాటిని తెరిచి ఉంచి పట్టణానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అదనపు సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
గత ఏడాది ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నగదు రహిత లావాదేవీలు, వివిధ రకాల పథకాలకు సంబంధించిన సేవలను ఈ-కేంద్రాల ద్వారా వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల్లో రేషన్ దుకాణాల్లో గ్రామీణులకు బ్యాంకుల ద్వారా అందే సేవలతోపాటు ఆధార్, వివిధ రకాల పరీక్ష ఫీజులు, పన్నుల చెల్లింపు సేవలను అనుసంధానం చేయనున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సేవలు, నగదు రహిత సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా ప్రజలు పట్టణాలకు వెళ్లే బాధలు తప్పుతాయి. గ్రామీణులు ఏ బ్యాంకుకు వెళ్లాలన్నా, సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయాలన్నా పట్టణాలు లేదంటే సమీపంలోని మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తున్నది. త్వరలో టీ-వాలెట్ అందుబాటులోకి రానుండడంతో గ్రామీణులకు, ముఖ్యంగా సమాఖ్యలు, సెల్ప్హెల్ప్ గ్రూపుల మహిళా సంఘాల సభ్యులకు తిప్పలు తప్పుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని పథకాల సేవలు రేషన్ దుకాణాల్లో ఏర్పాటు చేసే కేంద్రాల్లో అందుబాటులోకి వస్తాయి.
జనవరిలో డీలర్లకు ప్రత్యేక శిక్షణ..
జిల్లాలోని రేషన్ దుకాణాల్లో ఈ-సేవలు అందుబాటులోకి తెచ్చేందుకుగాను డీలర్లకు రెండురోజులు శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి విడుతలో జనగామ, బచ్చన్నపేట, లింగాలఘనపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి మండలాల డీలర్లకు జనగామలో శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడుతలో స్టేషన్ఘన్పూర్, చిల్పూరు, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, గుండాల మండలాల డీలర్లకు స్టేషన్ఘన్పూర్లో జిల్లా పౌరసరఫరాలశాఖ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా వినియోగదారులకు టీ-వాలెట్ సేవలు ఎలా అందించాలనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఫిబ్రవరి నుంచి టీ-వాలెట్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతం నెలలో 15 రోజులు మాత్రమే సరుకుల పంపిణీ కోసం రేషన్ దుకాణాలను తెరుస్తుండగా, ఇకపై నెలరోజులు (సెలవు దినాలు మినహా) వినియోగదారులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.
డీలర్లకు పెరగనున్న ఆదాయం..
ప్రజాపంపిణీ ద్వారా అందించే సరుకులు తగ్గడంతో ఆదాయం తక్కువ వస్తున్నదని ఆందోళన చెందుతున్న రేషన్ డీలర్లకు టీ-వాలెట్ సేవలు మరింత ప్రయోజ నం కలిగించనుంది. రోజంతా చేతినిండా పని లభించడంతోపాటు ఆదాయం పెరగనుంది. రేషన్ దుకాణాల్లో ఈ-సేవల ద్వారా డీలర్లకు కమీషన్ లభించనుంది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల రేషన్ డీలర్లకు ఆదాయం పెరగడంతోపాటు ప్రజలకు మరిన్న సేవలు అందనున్నాయి.