జ్వర పీడితులను గుర్తిస్తున్న వైద్య సిబ్బంది
కరోనా కట్టడికి అవగాహన కార్యక్రమాలు
ఇంటి వద్దే మందుల కిట్ల అందజేత
నర్సంపేట/వర్ధన్నపేట, జనవరి 23: కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా జ్వర సర్వే జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ లక్షణాలు ఉన్న వారికి మందులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నర్సంపేట పట్టణంలో ఫీవర్ సర్వే చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్ వార్డుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలని, పాటిజివ్ వచ్చిన వారు హోం ఐసొలేషన్లో ఉంటూ మందులు వాడాలని కోరారు. అలాగే, పట్టణంలో ఆరుబయట చెత్త వేయొద్దన్నారు. చెత్తను పారిశుధ్య కార్మికులకు అందించి పట్టణ శుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలంలో ఇంటింటా జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది సంయుక్తంగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందా… దగ్గు, జలుబు ఉందా అని తెలుసుకుంటున్నారు. కరోనా నివారణ చర్యలను వారికి వివరిస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి రావొద్దని కోరుతున్నారు. ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే మందుల కిట్ అందజేస్తున్నారు.
ప్రజారోగ్యంపై శ్రద్ధ వహించాలి
నల్లబెల్లి: ప్రజారోగ్యంపై వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేడెపల్లి పీహెచ్సీ వైద్యాధికారి శశికుమార్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఆయన కరోనా, ఒమిక్రాన్ వైరస్పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైరస్ విజృంభిస్తున్నందున వైద్య సిబ్బంది జ్వర సర్వేను ముమ్మరం చేయాలన్నారు. లక్షణాలు ఉన్న వారికి కరోనా టెస్టులు చేస్తూ మందులు అందించాలని సూచించారు. ప్రజలు మాస్కులు ధరిస్తూ భౌతికదూరం పాటించాలన్నారు. శానిటైజర్ వాడుతూ పరిశుభ్రత పాటించాలని కోరారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు బయటకు రావొద్దన్నారు. వైద్య సిబ్బంది సలహాలు, సూచనల మేరకు మందులు వాడుతూ పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.