పల్లె ప్రగతితో ఆదర్శంగా శివాజీనగర్ జీపీ
అందుబాటులోకి వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్
మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం
ఆహ్లాదం పంచేలా ప్రకృతి వనం
అభివృద్ధిలో దూసుకుపోతున్న గ్రామం
రఘునాథపల్లి ఆగస్టు 22 : పల్లె చిన్నదైనా అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా నిలిచింది శివాజీనగర్. ఇంతకుముందు కంచనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ పల్లె.. నేడు కొత్త జీపీగా ఏర్పడడంతో ప్రగతిలో దూసుకుపోతోంది. గ్రామ జనాభా 676. నివాస గృహాలు150. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా నిర్దేశించిన పనుల్ని పాలకవర్గం పక్కా ప్రణాళికతో పూర్తిచేసింది. ప్రజల భాగస్వామ్యం, అధికారుల సమన్వయంతో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నది. ఫలితంగా గ్రామం ఆదర్శంగా నిలిచింది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి కాగా, ఇంకుడుగుంతల నిర్మాణం 80శాతం పూర్తయ్యింది. గ్రామంలో వన నర్సరీ ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. హరితహారంలో భాగంగా రెండేళ్లుగా మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఈసారి గ్రామంలో సుమారు 3వేల మొక్కలు నాటారు. రూ.17లక్షలతో వీధుల్లో సీసీ రోడ్లు వేయించి పరిశుభ్రతకు పెద్దపీట వేసింది. అలాగే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ సమకూర్చడంతో ప్రతి రోజూ ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తను పారిశుధ్య సిబ్బంది తరలిస్తూ, మొక్కలకు ట్యాంకర్ సహాయంతో నీళ్లు పడుతున్నారు.
పల్లె ప్రగతి పనులు పూర్తి
పక్కా ప్రణాళికతో పల్లె ప్రగతి పనులు పూర్తిచేశారు. గ్రామాల సుందరీకరణలో భాగంగా పల్లె ప్రకృ తి వనాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. పది గుంటల స్థలంలో వివిధ ప్రాంతాల నుంచి నీడనిచ్చే, తీరొక్క పూల మొక్కలను తెప్పించి నాటించారు. అలాగే రూ. 12.60 లక్షలు వెచ్చించి వైకుంఠధామాన్ని త్వరితగతిన పూర్తి చేశారు. తడి, పొడి చెత్తను వేరుచేసే సెగ్రిగేషన్ షెడ్డును నిర్మించి అందుబాటులోకి తేవడంతో సేంద్రియ ఎరువులను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే..
గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడినా ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పం. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సహకారంతో గ్రామ రూపురేఖలు మా ర్చుతాం. గ్రామ ప్రజ ల సహకారంతో అభివృద్ధి పనులు పూర్తిచేశాం. ప్రభుత్వ స్థలంలోనే పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డును నిర్మించాం. చిన్న జీపీ అయి నా అధికారుల సూచనలు, సలహాలతో గ్రామా న్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం. పంచాయతీ కార్యదర్శి కొంపెల్లి భానుప్రియ, కారోబార్ రామకృష్ణ, పంచాయతీ సిబ్బంది పోచయ్య, ఐలయ్య కృషితో పనులు వేగంగా జరుగుతున్నాయి.