అకాల వర్షంతో పంటలకు తీవ్రనష్టం
రైతులు ధైర్యంగా ఉండాలి
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
నర్సంపేట రూరల్, జనవరి 14: ‘ఇటీవల నర్సంపేట డివిజన్లో అకాలవర్షం, వడగండ్లు పెద్ద ఎత్తున పడ్డాయి. దీంతో రైతులు ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నాం’ అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట, రాజుపేట, ఇప్పల్తండాలో భారీ వడగండ్లకు దెబ్బతిన్న మక్కజొన్న, మిర్చి తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అకాల వర్షం నర్సంపేట నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసిందని పెద్ది ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఏమాత్రం అధైర్యపడొద్దని, జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. పెద్ది వెంట నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి, ముత్తోజిపేట, ఇప్పల్తండా సర్పంచ్లు గోలి శ్రీనివాస్రెడ్డి, బానోత్ సుజాత, నాయకులు తాళ్లపెల్లి రాంప్రసాద్, కోతి చలం, బానోత్ శంకర్నాయక్, జంగ రవికుమార్, రమేశ్, చాంద్పాషా, రవి, రమేశ్ ఉన్నారు. కాగా, ముత్తోజిపేటలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన రైతుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా కల్పించడంతో ధర్నా విరమించారు.
స్వామివారి ఆశీస్సులు ఉండాలి
వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని క్యాంపు కార్యాలయంలో ద్వారకపేట వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీకి రూ. 5 లక్షల సీడీపీ నిధులను ఎమ్మెల్యే అందజేశారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ద్వారకపేట వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి తాను ప్రత్యేక చొరవ తీసుకుంటున్న తెలిపారు. ద్వారకపేట జీపీ భవనం నుంచి ఆలయం వరకూ సీసీరోడ్డు నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్రెడ్డి, 6వ, 7వ వార్డు కౌన్సిలర్లు రామసహాయం శ్రీదేవి, మినుముల రాజు, మోతె నరేందర్, ఆలయ ప్రధాన అర్చకులు ఆరుట్ర వెంకటాచార్యులు, శ్రీధరాచార్యులు పాల్గొన్నారు.
బాధితులను ఆదుకుంటాం
నల్లబెల్లి: వడగండ్ల వానతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ నష్టపరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది అన్నారు. గుండ్లపహాడ్లో ఇటీవల వడగండ్ల వానకు ధ్వంసమైన ఇండ్లు, పంటలను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దన్నారు. అలాగే, ఇ టీవల అనారోగ్యంతో మృతి చెందిన పలువురి కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి సానుభూతి తెలియజేశారు.
రైతు సేవా కేంద్రాల సేవలు అభినందనీయం
ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను అన్నదాతలకు చేరువలోకి తేవడం అభినందనీయమని ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. నల్లబెల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ పనిముట్లు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో లభిస్తాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, నాయకులు పాలెపు రాజేశ్వర్రావు, గందె శ్రీనివాస్గుప్తా, సర్పంచ్లు చింతపట్ల సురేశ్, సిద్ధూరి రత్నాకర్రావు, తిప్పని సృజనాలింగమూర్తి, వక్కల చంద్రమౌళి, నాయకులు భిక్షపతి, వీరస్వామి, డ్యాగల కృష్ణ, గుమ్మడి వేణు, వర్ణం నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వానికి నివేదిస్తాం: జేడీఏ ఉషాదయాళ్
దుగ్గొండి: వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట నష్టంపై నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని జేడీఏ ఉషాదయాల్ అన్నారు. మండలంలోని మైసంపల్లి, స్వామిరావుపల్లిలో శుక్రవారం ఆమె మిర్చి, మక్కజొన్న పంటలను పరిశీలించారు. శనివారం వరకు పంటనష్టం జరిగిన గ్రామాల్లో అధికారులు సర్వే చేసి పరిహారం అందేలా కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు హనుమంతు, రాజేశ్, స్వామిరావుపల్లి, మైసంపల్లి సర్పంచ్లు ఏ సుమలతానరేందర్రావు, గంగారపు వనమాల, ఉపసర్పంచ్లు ఇటుకాల నగేశ్, రాజేశ్వర్రావు, రైతులు దాసరి రాజు, బాబురావు పాల్గొన్నారు.