పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర దంపతులు
గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయం
భూపాలపల్లి రూరల్, జనవరి 14 : ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం భూపాలపల్లి పట్టణం సుభాష్కాలనీలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి దంపతులు హాజరయ్యారు. వారికి వేద పండితులు దబ్బెట వరప్రసాదాచార్యులు, దబ్బెట వంశీకృష్ణాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గండ్ర దంపతులు గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారామాంజనేయస్వామికి ఏడు కిలోల వెండి తొడుగులు, వెండి తీర్థం గిన్నె బహూకరించారు. ఆలయ ద్వారానికి ఇత్తడి తొడుగు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఏటా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నెల రోజులపాటు గోదారంగనాథస్వామి కల్యాణోత్సవాలు జరిగేవని, ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం అన్నదానాన్ని ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించారు. భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, భూపాలపల్లి సింగరేణి జీఎం శ్రీనివాసరావు, జిల్లా యువజన క్రీడల అధికారి సునీత, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జనార్దన్, పీఏసీఎస్ చైర్మన్లు మేకల సంపత్యాదవ్, పూర్ణ చందర్, జడ్పీటీసీలు పులి తిరుపతిరెడ్డి, గొర్రె సాగర్, సీఐ వాసుదేవరావు, భూపాలపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, జిల్లా నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.