జయశంకర్ జిల్లాలో 36 ప్రైమరీ స్కూళ్లలో ఖాళీలు భర్తీ
మూతబడిన, టీచర్లు లేని బడులపై సర్కారు దృష్టి
ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉండేలా కృషి
317 జీవోతో మారుమూల పాఠశాలలకు మంచిరోజులు
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 12( నమస్తేతెలంగాణ) : రాష్ట్ర సర్కారు తెచ్చిన 317 జీవో బడులను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు వరంలా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏళ్ల తరబడి మూతబడిన పాఠశాలలకు ఈ జీవోతో మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అటవీ గ్రామాల్లో ప్రాథమిక విద్య పూర్తిగా నిర్వీర్యమైంది. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉండేలా కృషి చేస్తున్నది. జిల్లాలోని భూపాలపల్లి మండలంలో నాలుగు, గణపురంలో ఒకటి, కాటారంలో రెండు, మహదేవపూర్లో ఏడు, మహాముత్తారంలో 12, పలిమెలలో 10 పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. గతంలో టీచర్లు లేక మాతబడిన బడులు ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 317తో బడులకు బలం చేకూరడంతో పాటు విద్యార్థులకు వరంలా మారింది. ఎన్నో ఏళ్లుగా మూతబడిన, టీచర్లు లేని పాఠశాలలకు మోక్షం లభించింది. దీంతో మారుమాల ప్రాంతాల్లో వెనుకబడిన చదువులు ఇక ముందుకు సాగనున్నాయి. గిరిజన గ్రామాల్లో విద్య మెరుగు పడనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పాలనా సౌలభ్యం కోసం 2016లో చిన్న జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కేంద్రంగా పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను తాత్కాలికంగా విభజన చేసి ఆయా జిల్లాలకు కేటాయించింది. జోనల్ వ్యవస్థను తీసుకువచ్చి కొత్త జిల్లాలకు ఉద్యోగ, ఉపాధ్యాయులను కేటాయించింది. ఆయా సంఘాల ప్రతినిధులతో చర్చించిన ప్రభుత్వం 317 జీవోను అమల్లోకి తీసుకువచ్చింది. దీనిపై బీజేపీ నాయకులు గగ్గోలుపెట్టి రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు మధ్య అంతరం పెంచేందుకు, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు దొంగ దీక్షల నాటకం ఆడారు. వారి కుట్రలను గమనించిన ప్రభుత్వం 317 జీవో వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ప్రజలకు కళ్లముందు కనిపించేలా చర్యలు చేపట్టింది. జీవో వల్ల జిల్లాలోని 36 మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలకు పూర్తి స్థాయిలో రెగ్యులర్ ఉపాధ్యాయులను కేటాయించేలా చర్యలు చేపట్టారు. గతంలో ఉపాధ్యాయులు లేక మాతబడిన పాఠశాలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి.
ఉపాధ్యాయుల కేటాయింపు
జీవో ద్వారా జిల్లాలోని మారుమూల మండలాల్లో ని 36 పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించే అ వకాశం దక్కింది. గతంలో దూర ప్రాంత బడులకు పం తుళ్లు వెళ్లకపోవడంతో మూతబడిన సంఘటనలు అ నేకం ఉన్నాయి. జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలోనూ ఉపాధ్యాయుడు ఉండేలా కలెక్టర్ ఆదేశాల మేరకు వి ద్యాశాఖ అధికారులు టీచర్లను కేటాయించారు. దీంతో బడులు పూర్వ వైభవం సంతరించుకున్నాయి.
నిండిన ఖాళీలు
జిల్లాలో గతంలో ఉపాధ్యాయులు లేక మూతబడిన పాఠశాలలు 36 ఉన్నాయి. 11 మండలాల పరిధిలో భూపాలపల్లి మండలంలో 4 , గణపురంలో ఒకటి, కాటారంలో రెండు , మహదేవపూర్లో ఏడు, మహాముత్తారంలో 12, పలిమెల మండలంలో 10 పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను అధికారులు భర్తీ చేశారు. జిల్లా విద్యాశాఖ కేటాయించిన ప్రతి మండలంలోని పాఠశాలకు ఉపాధ్యాయులు చేరినట్లు రిపోర్ట్ చేసే ప్రక్రియను సైతం పూర్తి చేశారు.