రోడ్ల ఎత్తుకు తగ్గట్టు డ్రైనేజీలు నిర్మించాలి
అధికారులు సమన్వయంతో పని చేయాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్, జనవరి 12: బల్దియా ప్రధాన కార్యాలయం ఎదుట నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి కార్యాలయం ఎదుట నిలిచిన నీటితోపాటు బల్దియా ఎదుట నాలా పూడికతీత పనులను బుధవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్మార్ట్రోడ్ల నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్ల ఎత్తు పెరుగుతున్నట్లు తెలిపారు. దానికి తగ్గట్టుగా డ్రైనేజీలను నిర్మించడంతోపాటు హీప్ హోల్స్ ఏర్పాటు చేసి నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. నగరంలోని నాలాలు, డ్రైనేజీల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగం అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు సుంకరి శివ, దేవరకొండ సురేందర్, చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు శ్రీనివాసరావు, డీఈలు రవికుమార్, రవీందర్, శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, భాస్కర్ పాల్గొన్నారు.
వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా కట్టడి
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారానే కరోనా వైరస్ కట్టడి సాధ్యమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను ఆమె పరిశీలించారు. ఫ్రంట్లైన్ వారియర్స్గా ఉన్న మున్సిపల్ కార్మికులు బూస్టర్ డోస్ తీసుకోవాలని కోరారు. మేయర్ వెంట చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, బల్దియా జేఏసీ అధ్యక్షడు గౌరీశంకర్, సూపరింటెండెంట్ సంతోష్కుమార్, రాజారపు భాస్కర్, సూర్యనారాయణ, రవి, ఏఎన్ఎం మంజుల పాల్గొన్నారు.