వరంగల్, జనవరి 12: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో స్మార్ట్సిటీ పనుల్లో వేగం పెంచాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. కుడా కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆమె బల్దియా, ఇరిగేషన్, కుడా, ఎన్పీడీసీఎల్, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్షించారు. స్మార్సిటీ, వివిధ పథకాల ద్వారా చేపట్టనున్న అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల్లో జాప్యం జరుగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గోపాలపురం ఊర చెరువు నుంచి ప్రెసిడెన్సీ స్కూల్ వరకు జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నగరంలో వర్షపు నీరు సులువుగా వెళ్లేలా కల్వర్టుల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. స్మార్ట్సిటీ రహదారుల నిర్మాణాలకు ఆటంకం కలుగకుండా ఎన్పీడీసీఎల్, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంలో రోడ్లపై ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్లను మార్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం భద్రకాళీ బండ్ అభివృద్ధి పనులపై ఆమె సమీక్షించారు. రెండో విడుత బండ్ సుందరీకరణలో టైల్స్కు బదులు గ్రానెట్ వేయాలని సూచించారు. కుడా పరిధిలోని గీసుగొండ మండలం ముస్త్యాలపల్లి, రెడ్డిపాలెం ప్రాంతాల్లో జంక్షన్ల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. సమీక్షలో బల్దియా ఎస్ఈ సత్యనారాయణ, కుడా పీవో అజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, ఇరిగేషన్ ఈఈ ఆంజనేయులు, స్మార్ట్సిటీ పీఎంవో ఆనంద్ వోలేటి, ఈఈలు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాసరావు, డీసీపీ ప్రకాశ్రెడ్డి పాల్గొన్నారు.