మూడేళ్ల కింద 8మంది విద్యార్థులే
ఇంగ్లిష్ మీడియంతో ఇప్పుడు 85మంది
చిత్రాలతో ఆకట్టుకుంటున్న తరగతి గదులు
ప్రైవేట్కు దీటు సీతారాంపురం యూపీఎస్
ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధుల కృషికి ఫలితం
‘మన ఊరు-మన బడి’తో మరింత వైభవం రానుందని ధీమా
దేవరుప్పుల, జనవరి 31: ఒకప్పుడు ఎంతోమందిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఆ సర్కారు బడి.. ‘ప్రైవేట్ స్కూళ్ల’ దూకుడుకు తట్టుకోలేక మూతబడే స్థాయికి చేరింది. సుమారు 300మందితో కళకళలాడే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అమాంతం 8మందికి పడిపోయి ప్రశ్నార్థకంగా మారింది. ఏ ఆంగ్ల మాధ్యమం లేక ఈ పాఠశాలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో అదే ఆంగ్ల మాధ్యమం అమలుతో మళ్లీ కొత్తజీవం పోసుకున్నది. ఊరి బడిని బతికించుకునేందుకు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించి గ్రామస్తులు, తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగింది. ప్రస్తుతం 85మందితో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే నడుస్తుండగా వచ్చే విద్యా సంవత్సరానికల్లా 125కి పెంచుతామనే భరోసానిచ్చింది. ఇలా దాతల సహకారంతో సీతారాంపురం ప్రాథమికోన్నత పాఠశాల రూపురేఖలే మారిపోగా ‘మన ఊరు-మన బడి’తో మరింత వైభవం సంతరించుకోనున్నది.
దేవరుప్పుల మండలం సీతారాంపురంలోని ప్రాథమికోన్నత పాఠశాలపై ఆంగ్ల భాష ప్రభావం పడింది. 2018-19లో ఉపాధ్యాయులు ఆరుగురు ఉంటే విద్యార్థులు ఎనిమిది మందే ఉండటంతో స్కూల్ మూతపడే దుస్థితి వచ్చింది. గ్రామంలోని ప్రజాప్రతినిధులు, ప్రధానో పాధ్యాయుడు, ఉపాధ్యాయులు ఎలాగైనా బడిని బతికించుకోవాలని భావించారు. అంతా ఏకమై పాఠశాలలో ఐదో తరగతి వరకు ఆంగ్ల బోధనకు అనుమతి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యం ఇల్లిల్లూ తిరిగి తాము ఆంగ్ల భాషలోనే బోధన చేస్తామని, పిల్ల లకు మెరుగైన విద్యనందించి ఉన్నతులుగా తీర్చిదిద్దుతామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. దీంతో 2019-20 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 49కి పెరిగింది. ఈ క్రమంలో పాఠశాలలో మంచి ఫలితాలు రావడంతో తల్లిదండ్రులకు పాఠశాలపై నమ్మకం పెరిగింది. 2020-21 విద్యా సంవత్సంలో ఏకంగా విద్యార్థుల సంఖ్య 85 చేరింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఈ సంఖ్య 125కు చేరుతుందని ప్రధానోపాధ్యాయుడు అశోక్ యాదవ్ భరోసాతో చెప్తున్నారు.
ప్రయత్నం ఫలించింది.. బడిని మార్చేసింది
సీతారాంపురం పాఠశాలకు బతికించుకోవాలనే ప్రయత్నం ఫలించింది. గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధుల శ్రమకు దాతల సహకారం తోడై పాఠశాల కొత్తరూపు సంతరించుకుంది. ముఖ్యంగా గ్రామ సర్పంచ్ రెడ్డిరాజుల రమేశ్, మాజీ సర్పంచ్ బస్వ మల్లేశ్ కాళ్లకు బలపం కట్టుకొని మరీ తిరిగారు. ఫలితంగా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఇక్కడి పాఠశాలలో మెరుగైన బోధన అందుతుండడంతో తల్లిదండ్రులకూ సర్కారు బడిపై నమ్మకం కలిగింది. ఇదే అదనుగా పాఠశాల రూపురేఖలు మార్చి, అన్ని మౌలిక వసతులు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని భావించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. తరగతి గదులకు తీరొక్క రంగులు వేయించి, గోడలపై అక్షరమాలలతో పాటు విషయ పరిజ్ఞానం పెరిగేలా ‘మ్యాథ్స్, సైన్స్ బొమ్మల’ను చిత్రించారు. దేశ చరిత్రను తెలిపే అనేక పెయింట్లతో పాఠశాలను సరికొత్తగా మార్చేశారు. దీని వల్ల తరగతి గదిలోకి ప్రవేశించే విద్యార్థులకు ఓ కొత్త అనుభూతి కలిగేలా తయారుచేశారు.
కలిసొచ్చిన దాతల సహకారం
గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు, వ్యాపారులు, ఔత్సాహికులు సీతారాంపురం పాఠశాలకు చేయూతనిచ్చారు. తమకు తోచిన విధంగా సహకరించారు. పాఠశాల పూర్వ విద్యార్ధి ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ పుప్పాల వీరసోమయ్య రూ.2 లక్షలు, గ్రామానికి చెందిన వైశ్యుడు పొద్దుటూరి వేంకటేశ్వర్లు హైదరాబాద్లోని వాసవికన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం పక్షాన రూ.లక్ష, స్వయంగా మరో రూ.11వేలు, గ్రామానికి చెందిన పొద్దుటూరి ఉమారాణి రూ.5వేలు, కందుకూరి వేంకటేశ్వర్లు రూ.10వేలు, గ్రామానికి చెందిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎలకొండ యాదగిరి రూ.55వేలు, కందికొండ కిరణ్కుమార్ రూ.16 వేలు, జొన్నల శ్రీనివాస్ రూ.35వేలు, మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ రూ.10వేలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దండోబోయిన అశోక్యాదవ్ రూ.17 వేలు పాఠశాలకు విరాళంగా అందించారు.
‘మన ఊరి-మన బడి’ విద్యార్థులకు వరం
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధన ప్రవేశపెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఓ వరం. ఇన్నాళ్లూ తాము చేసిన కృషికి ఈ కార్యక్రమం ఊతం ఇస్తుంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సీతారాంపురం యూపీఎస్లో వచ్చే విద్యాసంవత్సరంలో 125కు పెంచుతామనే నమ్మకం ఉంది. పాఠశాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వంపై పూర్తి బాధ్యత వేయకుండా విద్యాభిలాషులు, దాతలు ముందుకురావాలి. దాతలు సహకారంతోనే అన్నీ చేయగలిగాం. తల్లిదండ్రుల దృక్పథం ఇకనైనా మారాలి. పైవేట్కు వెళ్లి ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు. తాము ఇంటింటికీ వెళ్లి తల్లిందండ్రులకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చాం. ప్రయత్నం ఫలించింది. సర్కారు నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల దశ మారనుంది.-దండెబోయిన అశోక్యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు