పంట నష్టంపై జిల్లాలో సర్వే నిర్వహించిన వ్యవసాయ శాఖ
రైతు వారీగా వివరాలు నమోదు చేసిన ఏఈవోలు
జీపీ కార్యాలయాల వద్ద జాబితా డిస్ప్లే
నివేదిక తయారీలో అధికారుల నిమగ్నం
ప్రాథమిక అంచనాల ప్రకారం 26,376 ఎకరాల్లో పంట నష్టం
191 గ్రామాల్లో 21,522 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు గుర్తింపు
వరంగల్, జనవరి 31(నమస్తేతెలంగాణ) : పంట నష్టంపై జిల్లాలో సర్వే పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు రైతు వారీగా వివరాలు సేకరించారు. వడగండ్ల వానతో గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదిక పంపే పనిలో ఉన్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో కురిసిన వడగండ్ల వానతో పంటలకు అపా ర నష్టం కలిగింది. మిర్చి, మక్కజొన్న, వేరుశనగ, జొ న్న, అరటి, బొప్పాయి, మినుము, పెసర, ఆవు బఠాని, ఆవాలు, కూరగాయలు, ఇతర పండ్ల తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, ఖా నాపురం, చెన్నారావుపేట, నెక్కొండ, సంగెం, గీసుగొం డ, వరంగల్, ఖిలావరంగల్ మండలాల్లోని 191 గ్రా మాల్లో ఈ ప్రభావం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పంట నష్టాలపై వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు గ్రామాలను సందర్శించి మొదట ప్రాథమిక అంచనాలు వేశారు. 21,522 మంది రైతులకు చెందిన 26,376 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ఇందులో 12,238 మంది రై తులకు చెందిన 15,565 ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయి. మిర్చి పంట విస్తీర్ణం 14,686 ఎకరాలుగా ఉంది. 11,664 మంది రైతులు మిర్చి పంటను పూర్తి గా కోల్పోయినట్లు నివేదికలో తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది రైతులు 19,057ఎకరాల్లో సాగు చేస్తే 14,686 ఎకరాల్లోని పంట వడగండ్ల వానకు తుడిచిపెట్టుకుపోయింది. 10,811 ఎకరాల్లో మక్కజొన్న, వేరుశనగ, మినుము, పెసర తదితర పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదికలో వెల్లడించారు. 9,284 మంది రైతులు నష్టపోయినట్లు తెలిపారు. పంట నష్టంపై కలెక్టర్ బీ గోపి వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష చేశారు.
సర్వేకు ప్రభుత్వం ఆదేశాలు..
వడగండ్ల వానతో పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో మొదట నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గ్రామా ల్లో పర్యటించారు. పంట నష్టంపై క్షేత్రస్థాయిలో తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్ట పరిహారం వచ్చేలా కృషి చేస్తానని బాధిత రైతులకు భరోసా ఇచ్చా రు. కలెక్టర్ బీ గోపి, వ్యవసాయ, ఉద్యానశాఖల జిల్లా అధికారులు ఉషాదయాళ్, శ్రీనివాసరావు నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి కోసం వెచ్చించామని, చేతికందొచ్చిన పంట వడగండ్ల వానతో దెబ్బతిన్నదని బాధిత మిర్చి రైతులు కలెక్టర్కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము ఒక్కో ఎకరంలో రూ.70 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు అరటి తోట రైతులు బోరుమన్నారు. కాగా, పంట నష్టంపై సర్వే చేపట్టి రైతు వారీగా గణన జరుపాలని అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జనవరి 17వ తేదీ నుంచి జిల్లాలో వ్యవసాయ శాఖ సర్వే చేపట్టింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో జనవరి 18న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట మండలంలోని ఇప్పలతండాను సందర్శించారు. పంట నష్టపోయిన రైతులతో మంత్రులు మాట్లాడారు. బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఓదార్చారు.
పంచాయతీల వద్ద డిస్ప్లే..
జిల్లాలో పంట నష్టంపై వ్యవసాయశాఖ అధికారులు సర్వే నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి, ఏఈవోలు సర్వేలో పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్, ఏడీఏలు సర్వేను పర్యవేక్షించారు. రైతు వారీగా పంట నష్టం వివరాలు నమోదు చేసి జాబితాను ఆయా జీపీ కార్యాలయాల వద్ద డిస్ప్లే చేశారు. జాబితాపై అభ్యంతరం ఉంటే తమ దృష్టికి తేవాలని కోరారు. ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటను నష్టపోయారనేది జాబితాలో పేర్కొన్నారు. నర్సంపేట డివిజన్లో సోమవారం సర్వే పూర్తయినట్లు నర్సంపేట ఏడీఏ తోట శ్రీనివాసరావు చెప్పారు. పారదర్శకంగా సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. సర్వే పూర్తి కావడంతో జిల్లాలో జరిగిన పంట నష్టంపై ప్రభుత్వానికి పంపేందుకు నివేదికను తయారు చేసే పనిలో వ్యవసా య శాఖ అధికారులు తలమునకలయ్యారు. ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది?, పంట నష్టపోయిన రైతు లు ఎంతమంది?, ఏ పంటకు ఎన్ని ఎకరాల్లో నష్టం కలిగింది? అనేది నేడో రేపో వెల్లడికానుంది.