రెండు కార్లు, రూ.40 వేలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఏసీపీ ఫణీందర్
నర్సంపేట, జనవరి 31 : వైన్షాపు, గిరిగిరి వ్యాపారి ముత్యం శ్రీనివాస్ కిడ్నాప్ కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేసి, వారి నుంచి రూ.40 వేలు, రెండు కార్లు, మోటర్ సైకిల్, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట ఏసీపీ ఫణీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముత్యం శ్రీనివాస్కు మాదన్నపేట రోడ్డులో వైన్షాపు ఉండగా, దానికి ఎదురుగా గొడిశాల లావణ్య మిర్చి బండి పెట్టుకుని వ్యాపారం చేస్తున్నది. లావణ్యకు శ్రీనివాస్ గిరిగిరికి డబ్బులు ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే నాలుగు నెలల కిందట పోలీసు స్టేషన్లో శ్రీనివాస్పై లావణ్య కేసు పెట్టింది. పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించగా, ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చారు. దీనిలో భాగంగా శ్రీనివాస్ ఆమెకు కొంత నగదును ఇవ్వగా లోక్ అదాలత్లో కేసును విత్డ్రా చేసుకున్నది. ఈక్రమంలో శ్రీనివాస్ ఆస్తిలో వాటా కాజేయాలనే ఉద్దేశంతో మాదిరాజు అనిల్, కొండా శ్రీశైలం, చిలువేరు రాజేందర్, జన్ను రవి, ఓర్సు గణేశ్, కొయ్యల అనిల్, రావుల అరుణ్కుమార్, ఎండీ అఖిల్పాషాతో కలిసి పథకం వేసింది. అడ్వాన్స్గా వారికి ఒక్కొక్కరికి రూ. 1.25లక్షల చొప్పున అడ్వాన్స్ ఇచ్చింది. అలాగే, శ్రీనివాస్ నుంచి వచ్చే డబ్బుల్లో 10శాతం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. వీరు రెండు నెలల పాటు రెక్కీ నిర్వహించారు. ఈక్రమంలో గత నెల 26న మాదన్నపేట పెద్ద కాల్వ వద్ద శ్రీనివాస్ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వీరు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేశారు. లావణ్యను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపుతామని బెదిరించారు. చివరకు కొత్తగూడ అడవుల్లో గుంజేడు వైపు తీసుకెళ్లారు. ముత్యం శ్రీనివాస్కు, గొడిశాల లావణ్యకు బలవంతంగా పెళ్లి చేశారు. కాగా, శ్రీనివాస్ కుమారుడు భరత్ తన తండ్రిని లావణ్య మనుషులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సంపేట సీఐలు పులి రమేశ్, సూర్యప్రసాద్ నాలుగు బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు చేశారు. పాకాల అడవుల్లో పోలీసు బృందాలను చూసిన కిడ్నాపర్లు శ్రీనివాస్, లావణ్యను ఆమె ఇంటి వద్ద దింపి పారిపోయారు. దర్యాప్తు ప్రారంభించి పోలీసులు తర్వాత ఆధారాలు సేకరించి లావణ్య, రాజేందర్ను అరెస్టు చేశారు. వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించి మిగతా వారిని సోమవారం అరెస్ట్ చేసి, మరో కారు, బైక్, ఆరు సెల్ఫ్లోను, రూ.40 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా జన్ను రవి అలియాస్ గుండురావు పరారీలో ఉన్నారు. ఎండీ అఖిల్పాషా, గణేశ్పై గతంలోనూ కేసులు ఉన్నాయని, వీరిపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.