నగర శివారులోకి సెంట్రల్ జైలు
ఆ స్థలంలో రీజినల్ కార్డియాక్ సెంటర్
సీఎం కేసీఆర్ దృష్టికి ప్రతిపాదనలు
బోయినపల్లి వినోద్కుమార్ వెల్లడి
జైలు సూపరింటెండెంట్తో సమీక్ష
వరంగల్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ హెల్త్హబ్గా రూపుదిద్దుకుంటున్నది. వైద్యపరంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇక్కడి ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని ఏకైక వైద్య విశ్వవిద్యాలయాన్ని వరంగల్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా సూపర్స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించింది. ఎంజీఎం, కేఎంసీ కేంద్రంగా ఇక్కడ మరిన్ని వైద్య సేవలందించే కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ చొరవ తీసుకున్నారు. సెంట్రల్ జైలును వరంగల్ నగర శివారులోకి తరలించే విషయంలో రాష్ట్ర ప్రభు త్వం వద్ద ఇప్పటికే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రస్తుతం సెంట్రల్ జైలు ఉన్న ప్రదేశంలో రీజినల్ కార్డియాక్ సెంటర్ ను నిర్మించేలా సీఎం కేసీఆర్కు ప్రతిపాదించనున్నట్లు వినోద్కుమార్ తెలిపారు.
గ్రేటర్ వరంగల్ శివారులోని 200 ఎకరాల స్థలంలోకి సెంట్రల్ జైలును తరలించేందుకు ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు చెప్పారు. సెంట్రల్ జైలు తరలిం పు, ఖైదీల సంక్షేమం వంటి అంశాలపై గురువారం హన్మకొండలోని తన నివాసంలో సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్రాయ్తో వినోద్కుమార్ సమీక్షించారు. ప్రతిపాదిత సెంట్రల్జైలు కోసం స్థలాన్ని గుర్తించామని, త్వరలోనే ఇది కొలిక్కి వస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని చర్లపల్లి ఓపెన్ ఎయిర్ సెంట్రల్ జైలుకు మించిన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరంగల్లో ప్రస్తుతం ఉన్న సెంట్రల్ జైలు స్థలంలో రీజినల్ కార్డియాక్ సెంటర్(ప్రాంతీయ గుండె వ్యాధుల కేంద్రం) ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 2005లో తాను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత జైలు తరలింపు ప్రతిపాదన పెట్టానని, తెలంగాణ రాష్ట్రంలో అది సాకారమవుతున్నదన్నారు. సెంట్రల్ జైలులో ఖైదీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సూపరింటెండెంట్ సంతోష్రాయ్ తెలిపారు. ఖైదీ ల కుటుంబాల అవసరాల కోసం రూ.50వేల చొప్పున రుణాలు ఇస్తున్నామని, స్వయం ఉపాధి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.