కరంటు లేక మూతపడ్డ పరిశ్రమలు.. లోవోల్టేజీతో బాయిల్డ్, రా-రైస్ మిల్లులకు తాళాలు.. పనుల్లేక వలసబాట పట్టిన కార్మికులు.. పస్తులతో అల్లాడిన కూలీల కుటుంబాలు.. సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లా ప్రాంత దైన్యమిది. ఎండాకాలం వచ్చిందంటే పవర్ హాలీడేలతో అటు యజమానులు, ఇటు కార్మికులు, కూలీలు, సిబ్బంది ఉపాధి లేక ఆగమయ్యేది. స్వరాష్ట్రంలో విద్యుత్రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో ఉమ్మడి జిల్లా పారిశ్రామిరంగం గణనీయమైన ప్రగతి సాధిస్తున్నది. 24గంటల విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు నిరంతరం నడుస్తూ లాభాలబాటలో పయనిస్తుండగా వాటిని నమ్ముకున్నవారు చేతినిండా పనులతో సంతోషంగా తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
వరంగల్, మే 6 (నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో మిల్లులు, పరిశ్రమల కరంటు కష్టాలు చెప్పనలవిగా ఉండేవి. ఎండాకాలం వచ్చిందంటే పవర్ హాలీడేల పేరుతో వారంలో మూడు రోజులే విద్యుత్ సరఫరా ఉండేది. ఆ మూడు రోజుల్లోనూ సాయంత్రం 6గంటల నుంచి 10 గంటల వరకే మిల్లులు, పరిశ్రమలు నడిచేవి. సరఫరాలో అంతరాయం ఏర్పడితే కనీసం 48 గంటల సమయం పట్టేది. నాణ్యమైన విద్యుత్ అందక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి పరిశ్రమలకు తీవ్ర ఆటంకం ఏర్పడేది. దీంతో నష్టాలు వచ్చి కార్మికులు, సిబ్బందికి అప్పులు చేసి జీతాలు చెల్లించాల్సిన దయనీయమైన పరిస్థితులు ఉండేవి. కొన్ని సందర్భాల్లో అసలు జీతాలే ఇవ్వలేని దుస్థితి ఉండేది. మంచి సీజన్లో కరంటు కోతల వల్ల వ్యాపారాలు నడవక అప్పుల ఊబిలో కూరుకుపోయేది. నెలకు 8నుంచి 10రోజుల పాటు పరిశ్రమలు మూతపడి రెక్కాడితే గాని, డొక్కాడని కార్మిక కుటుంబాలు పనుల్లేక పస్తులుండేవి.
తెలంగాణలో విప్లవాత్మక మార్పులు
స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలతో 24గంటల విద్యుత్ అందిస్తుండడంతో ఉమ్మడి జిల్లా పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు పనుల్లేక వలసలు వెళ్లిన రోజుల నుంచి ఇప్పుడు స్థానికంగానే చేతినిండా పనిదొరికే రోజులు వచ్చాయి. జిల్లాల్లో పుష్కలమైన పంట దిగుబడులతో కొత్తగా రైస్ మి ల్లులు, వందలాది పరిశ్రమలు ఏర్పడ్డాయి. పైగా దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుండడంతో కొత్త వ్యాపారులు రెట్టింపు ఉత్సాహంతో పరిశ్రమలు నెలకొల్పి, వేలాది మందికి ఉ పాధి కల్పిస్తున్నారు. పరిశ్రమ నెలకొల్పితే విద్యుత్ అధికారులు అక్కడ క్షణాల్లో స్తంభాలు వేసి, తీగలు లాగి ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నారు. రెప్పపాటు సమయం కూడా అంతరాయం కలుగకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. ఎక్కడైనా చిన్నా చితక సమస్యలుం టే వెంటనే మరమ్మతులు చేసి కరంటు సరఫరా చేస్తున్నారు. దీంతో పరిశ్రమలు 24గంటల పాటు మూడు షిఫ్టుల్లో నడుస్తూ లాభాల బాటలో పయనిస్తున్నాయి. సిబ్బంది, కార్మికులు, కూలీలకు చేతినిండా పనికల్పి స్తూ మంచి జీతాలు ఇస్తున్నాయి. దీంతో వాటిపై ఆధారపడ్డ కుటుంబాలు రంది లేకుండా బతుకుతున్నాయి.
జయశంకర్ జిల్లాలో 110 పరిశ్రమలు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 110 చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమలున్నాయి. వీటిలో 15 రైస్ మిల్లులు, రెండు కాటన్ జిన్నింగ్ మిల్లులు,సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమలు, మినరల్ వాటర్ ప్లాంట్, ఇతర పలు రకాల చిన్న తరహా పరిశ్రమలున్నాయి. తెలంగాణ సర్కారు 24 గంటల పాటు కరంటును సరఫరా చేస్తుండడంతో సీజన్ అనే కాకుండా అన్ని కాలాల్లో వ్యాపారాలు కొనసాగుతున్నట్లు యజమానులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆరు బాయిల్డ్ రైస్ మిల్లులున్నాయి. గతంలో వీటిలో కరంటు పోతే 8గంటల వరకు ఆర బెట్టాల్సిన పరిస్థితులు ఉండేవి. ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా మిల్లులు, ఇతర పరిశ్రమలు సజావుగా సాగుతూ లాభాలు పొందుతున్నాయి. కార్మికుల ఉపాధికి ఢోకా లేకుడా పోయింది.
మానుకోటలో 83 పరిశ్రమలు
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 83 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 7 పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. మిగిలిన 76 పరిశ్రమలు 24గంటల పాటు షిఫ్టుల వారీగా నడుస్తున్నాయి. 48 బాయిల్డ్, రా రైస్ మిల్లులు ఉండగా, మిగిలిన వాటిలో జిన్నింగ్, ఆయిల్, కారం, పసుపు మిల్లులున్నాయి. నెలకు సగటున 6,97,346 యూనిట్ల విద్యుత్ పరిశ్రమలకు వినియోగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్ పరిధిలో కేవలం పది నుంచి 20 వరకే పరిశ్రమలుండేవి.
జనగామలో కొత్తగా ఏర్పాటు
జనగామ పరిధిలో తెలంగాణ ఏర్పాటుకు ముందు 32 మిల్లులు ఉంటే, స్వరాష్ట్రంలో మరో 8 అదనంగా వెలిశాయి. జిల్లా కేంద్రంలోని పారాబాయిల్డ్, రా రైస్ మిల్లులు, పట్టు రీలింగ్ పరిశ్రమల్లో నిరాటంకంగా యంత్రాలు నడుస్తుండడంతో కార్మికులకు చేతినిండా పనిదొరుకుతున్నది. మిల్లులు, పరిశ్రమల్లో మూడు షిఫ్ట్ల్లో కార్మికులు పనిచేస్తున్నారు.
ఇస్ రాష్ట్ మే బిజిలి బహుత్ అచ్చీ రహతా హై
హనుమకొండ సబర్బన్ : తెలంగాణలో విద్యుత్ సరఫరా చాలా బాగుంది. 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వడం వల్ల మాకు అనేక ప్రయోజనాలున్నాయి. మేం ఇక్కడ ఇప్పటి వరకు 25 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశాం. సుమారు వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నాం. ఇదంతా మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరా వల్లనే సాధ్యమైంది. ఇక్కడ సరుకు రవాణాకు కూడా మంచి రహదారులున్నాయి. దీని వల్ల గ్రానైట్ను దేశంలోని అన్ని రాష్ట్రాలకు సులభంగా రవాణా చేయగలుగుతున్నాం. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ ఘనతే. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. రాజస్థాన్ నుంచి వచ్చి పరిశ్రమలను ఏర్పాటు చేసిన మాకు రక్షణ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు.
-విజయ్ పూనియా సింగ్, సాయి సలగర్ గ్రానైట్ ఫ్యాక్టరీ యజమాని
అప్పుడు మిల్లులు మూసేశాం..
ఉమ్మడి రాష్ట్రంలో వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ప్రకటిస్తే కార్మికులకు కూలి కూడా పడేది కాదు. దీంతో మిల్లుల్లో పని చేయడానికి కూలీలు రాకపోయేది. వారానికి మూడు రోజులు పూర్తిగా, మిగిలిన నాలుగు రోజుల పాటు ఇచ్చే విద్యుత్ను రోజుకు 6గంటలు తీసేవారు. దీంతో మిల్లుల్లో పని లేక కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. చాలాసార్లు మిల్లులు మూసేసిన సందర్భాలున్నాయి. తెలంగాణ వచ్చాక 24గంటల పాటు మిల్లులు నడుస్తున్నయ్. షిఫ్టుల వారీగా కార్మికులు పని చేస్తున్నారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తున్న సీఎం కేసీఆర్కు రైస్మిల్లర్ల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా.
– డీఎస్ రవిచంద్ర- రైస్మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్
బాధలు పోయినయ్..
ఉమ్మడి రాష్ట్రంలో గంటల కొద్దీ కరంటు పోయేది. వచ్చేదాకా ఖాళీగా కూర్చునేది. జనరేటర్ ఆన్ చేయడానికి కనీసం 15నిమిషాల సమయం పట్టేది. ఇలా రోజుకు గంటపాటు సమయం వృథా అయ్యేది. కొన్ని సార్లు జనరేటర్ స్టార్ట్ కాకుంటే గంటల తరబడి వేచి ఉండేవాళ్లం. తెలంగాణ వచ్చాక కరంట్ సమస్య అనేది లేకుండా పోయింది.
– తప్పెట్ల రాజు , ఫొటో ఆల్బమ్ డిజైనర్, మహబూబాబాద్
చేతి నిండా పనులు
గతంలో కరంటు కోతల వల్ల అనేక ఇబ్బందులు పడ్డం. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో చేతి నిండా పనులు దొరుకుతున్నయి. మిల్లులకు కరంటు ఉంటేనే నలుగురికి ఉపాధి దొరుకుతుంది. మాకు వ్యాపారం సజావుగా సాగుతుంది. గతంలో కరంటు కోతల వల్ల విపరీతమైన నష్టాలు వచ్చేవి. అప్పులమయంగా జీవితాలు సాగేవి. ప్రస్తుతం గడ్డు పరిస్థితుల నుంచి కోలుకుంటున్నం.
– కోరె రమేశ్, లక్ష్మీగణపతి ఇండస్ట్రీస్, గణపురం
ఇతర రాష్ర్టాల వారి ఆసక్తి
హనుమకొండ సబర్బన్ : పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో అనేక రాష్ర్టాల నుంచి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు నెలకొల్పాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఇప్పుడు 25 వరకు గ్రానైట్ కటింగ్ పరిశ్రమలున్నాయి. మున్ముందు మరిన్ని రానున్నాయి. నిరంతర విద్యుత్ను సరఫరా వల్ల మంచి ఉత్సాహంతో నడుస్తున్నాయి. గతంలో కోతల మూలంగా అనేక ఇబ్బందులు పడ్డం
-చక్రధర్ రెడ్డి, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎల్కతుర్తి