నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
కొత్త విద్యార్థుల కోసం రోజుకో కార్యక్రమం
30 వరకు కొనసాగనున్న బడిబాట
ఈ సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం
ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా విద్యాశాఖ
జనగామ, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్ను ప్రభుత్వం ఇప్పటికే ఎంఆర్సీలు, పాఠశాలలకు చేర్చింది. మధ్యాహ్న భోజనం కూడా అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలు ప్రారంభం కావడంతో పిల్లలకు కావాల్సిన యూని ఫాం, ఘా, కంపాస్బాక్స్, టై, బ్యాగు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్లు, వాటర్ బాటిళ్లు, టిఫిన్ బాక్స్ల కొనుగోళ్లతో దుకాణాల్లో సందడి నెలకొంది. మరోవైపు జిల్లా వ్యాపితంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను రవాణా శాఖ కొనసాగిస్తోంది.
విద్యార్థులకు డిజిటల్ పాఠాలు
మూడేళ్ల నుంచి జిల్లాలోని 123 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూంలను ప్రారంభించగా, 139 పాఠశాలల్లో మన టీవీ కార్యక్రమాల ద్వారా విద్యాబోధన తరగతులు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కింద వంట గదులు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్ సమకూర్చారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మొత్తం 72,256 మంది విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో బోధిస్తున్నారు. మొత్తం 645 పాఠశాలల్లో 362 ప్రాథమికోన్నత, 72 ప్రాథమిక, 132 జడ్పీ హైస్కూళ్లు ఉన్నాయి. ఇందులో చదువుకుంటున్న మొత్తం 41,461 మంది విద్యార్థులకు 90.92 టన్నుల బియ్యం, 91 సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే 15,315 మందికి ప్రతి నెలా 107.40 టన్నుల బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నది. జిల్లాలో కొత్తగా స్టేషన్ఘన్పూర్ (బా లురు), జనగామ(బాలికల) మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు జిల్లాలో 11 కేజీబీవీలు, 9 మోడల్ స్కూళ్లు, 7 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు పని చేస్తున్నాయి. వీరికి అవసరమైన మొత్తం 3.48 లక్షల పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచారు.
ఆటపాటలతో ఆంగ్లంలో చదువు..
జిల్లాలో మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 732 అంగన్వాడీ కేంద్రాల్లో 49,776 మంది చిన్నారు లు నమోదయ్యారు. 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు ఆటపాటలు, కృత్యాలతో ఆంగ్ల అక్షరాలను నేర్పించి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను పూర్తి చేయించి అదే ప్రాంగణంలో ఉండే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నారు.
కొత్త విద్యార్ధుల కోసం రోజుకో కార్యక్రమం..
ఈనెల 3 నుంచి 10 వరకు స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇంటింటి సర్వే నిర్వహించి పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేందుకు వీలుగా ర్యాలీలు, కరపత్రాల పంపిణీ చేపట్టారు. 13వ తేదీ నుంచి 30 వరకు రోజుకో కార్యక్రమం చేపడుతారు.
ఈ నెల 30 వరకు జిల్లాలో బడిబాట
13న మన ఊరు-మనబడి
14న ఇంగ్లిష్ మీడియాన్ని స్కూళ్లలో వివరించడం.
15న తల్లిదండ్రులు, టీచర్ల సమావేశం.
16న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ
17న స్వయం సహాయక బృందాలతో సమావేశం
18న బాలిక విద్య అండ్ కెరీర్గైడెన్స్
20న సామూహిక అక్షరాభాస్యాలు
21న స్వచ్ఛ పక్షోత్సవం
22న హరితహారం
23న ప్రత్యేకావసరాలు గల పిల్లల నమోదు
24న బాల సభ నిర్వహణ
25న గ్రంథాలయ రోజు (చదువుల మేళా)
27న బడి బయటి విద్యార్ధుల నమోదు
28న ద్విభాషా పుస్తకాలపై అవగాహన కల్పించటం
29న డిజిటల్ ఎడ్యుకేషన్
30న గణితం, సైన్స్డే.