స్టేషన్ ఘన్పూర్/కాశీబుగ్గ, జూన్ 22 : ‘అగ్నిపథ్’ మంటలు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికే అల్లర్లలో ఓ యువకుడిని పొట్టనపెట్టుకోగా, తాజాగా నాన్ బెయిలబుల్ కేసుల పేరిట రైల్వే పోలీసుల వేధింపులు మరో అభ్యర్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాయి. కేసులు పెడితే శాశ్వతంగా ఉద్యోగం రాకపోగా జైలు జీవితం గడపాల్సి వస్తుందని.. కేసుల పాలైతే తల్లిదండ్రులు తట్టుకోలేరన్న బెంగతో మంగళవారం అర్ధరాత్రి గోవింద్ అజయ్(22) అనే ఆర్మీ అభ్యర్థి పురుగుల మందుతాగాడు.
వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పేద దంపతులు గోవిందు లింగస్వామి-రేణుకకు కూతురు, ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు అజయ్ డిగ్రీ వరకు చదివి పోలీసు లేదా ఆర్మీ జవాన్ కావాలని కలలు కన్నాడు. ఇందుకోసం రెండేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ ఎస్సై, కానిస్టేబుల్ సహా ఆర్మీలో ఎంపిక కోసం శిక్షణ పొందుతున్నాడు. కొద్దినెలల క్రితం ఆర్మీ ఉద్యోగానికి ఫిజికల్ టెస్ట్లో పాసై రాత పరీక్ష కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో కేంద్రం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించడంతో దేశంలో నిరసనలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఈ నెల 16న ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొందరు ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలు నిర్వహించగా చివరి గంటలో అజయ్ అక్కడికి చేరుకున్నాడు. ఈ నెల 15న సాయంత్రం తన సెల్ఫోన్ గ్రూప్కు వచ్చిన ‘రైల్వేస్టేషన్ బ్లాక్’ అనే మెసేజ్ ఆధారంగా మరుసటి రోజు ఉదయం స్టేషన్కు వెళ్లానని అప్పటికే బోగీలు కాలిపోయాయని చెప్పాడు.
ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు తుపాకీ తూటా తగిలి వారు గాయాలతో విలవిల్లాడడం చూసి చలించి వారి బాధ చూడలేక ఓ టీవీ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చానని అంతకుమించి ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజీలో ఎలాంటి ఆధారం లేదని, అంత పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని ఊహించలేదని అయినా తనను అల్లర్ల జాబితాలో చేర్చి విచారణకు సిద్ధంగా ఉండాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. ఎలాంటి సంబంధం లేకున్నా విచారణకు అందుబాటులో ఉండాలని రైల్వే పోలీసుల వేధిస్తున్నారని మనస్తాపానికి గురయ్యాడు. ఇప్పటికే అల్లర్ల ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించి రైల్వే పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తుండడం, తనను కూడా అరెస్టు చేస్తారేమోనని తీవ్ర మనస్తాపానికి గురైన అజయ్ మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో పురుగులమందు తాగాడు.
ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు హుటాహుటిన వరంగల్లో ఎంజీఎంకు తరలించి మెరుగైన చికిత్స కోసం వరంగల్ కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అజయ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సికింద్రాబాద్ అల్లర్ల ఘటనపై ఇప్పటికే 56మంది యువకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు ఆ జాబితాలో మరో 11మంది గుర్తుతెలియని వారు ఉన్నట్లు పేర్కొన్న నేపథ్యంలో అజయ్ గురించి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీయడం, విచారణకు అందుబాటులో ఉండాలని ఆర్పీఎఫ్, పోలీసుల నుంచి సమాచారం రావడం ఆందోళనకు గురిచేసింది. ఇప్పటికైనా కేసులు నమోదు చేయాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకొని అగ్నిపథ్ను రద్దు చేసి పాత పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని అజయ్ కోరుతున్నాడు.
జీవితాంతం జైలే అనుకున్నా
నేను పోలీసు, లేదా ఆర్మీ జవాను కావాలని ఎన్నో కలలు కన్న. అందుకోసం రెండు సంవత్సరాల నుంచి హైదరా బాద్లో శిక్షణ తీసుకుంటున్నా. ఫిజికల్ టెస్ట్లో పాస్ అయ్యా ను. నేను జవాను అవుతున్నా అని ఊరంతా చెప్పుకున్నా. ఆ రోజు నేను చివరి సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు పోయా ను. నా ముందే రాకేశ్ పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ఇది చూసిన నేను చలించిపోయాను. పక్కనే ఉన్న ఓ టీవీ చానల్ వాళ్లు నా ముందు మైక్ పెడితే ఈ పథకాన్ని రద్దు చేయాలని, 24 ఏళ్లు దాటితే ఉద్యోగంలో చేరడానికి అనర్హులు అనడం సరైంది కాదని, ఒక్క సంవ త్సరం అయితే నేను కూడా అనర్హుడిని అవుతాననే బాధతో టీవీకి వాయిస్ ఇచ్చాను. అంతే కానీ నేను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలో పాల్గొన లేదు. టీవీలో వచ్చిన వార్తను చూసి పోలీసులు నాకు ఫోన్ చేశారు. నాపై కేసులు పెడతారని, జీవితాంతం జైల్లో ఉండవలసి వస్తుందని, నేను కన్న కలలు జైలు గోడల్లో కరిగిపోతాయనిపించింది. ఇక ఇలాంటి జీవితం వద్దనుకొని ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకముందే అగ్నిపథ్ను రద్దు చేయాలి. అల్లర్లలో పాల్గొన్నవారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి. అంతే కానీ టీవీలో కనపడ్డ వారిందరిపై కేసులు పెట్టి వారి జీవితాలను ఆగం చేయవద్దు.
– గోవిందు అజయ్
నా కొడుకు పానం మీదికి తెచ్చిన్రు..
నా కొడుకు చదువులో ఫస్టు. మాకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ చదివించుకున్న. అమ్మా నేను ఆర్మీలో చేరి దేశాన్ని కాపాడుతా అని ఎప్పుడూ చెప్పేటోడు. పోలీస్ ట్రైనింగ్ అంటూ రెండేళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అగ్నిపథ్తో మాకు నష్టం అయితది.. అది తీసేయాలని అందరు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో నిరసన చేస్తున్నారని అక్కడి పోయానని చెప్పిండు. అక్కడ టీవీలో మాట్లాడిన కానీ, ఎలాంటి గొడవలు చేయలేదన్నడు. టీవీలో వచ్చింది చూసి ఎక్కడ కేసు పెడతరోనని మస్తు భయపడ్డడు. మంగళవారం సాయంత్రం గడ్డి మందు తాగిండు. నా కొడుకు దేశాన్ని కాపాడే జవాన్ అయితడనుకున్నా. కానీ బీజేపోళ్లు చేయవట్టి నా కొడుకు పానం మీదికి వస్తదని అనుకోలే. నా కొడుకు దేశాన్ని కాపాడకున్నా పరవాలేదు, మా కళ్లముందు ఉంటే చాలు, కూలో, నాలో చేసుకుని బతుకుతం.
– గోవిందు రేణుక, అజయ్ తల్లి