జనగామ, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలను పక్కనబెట్టి తెలంగాణ అభివృద్ధిపై పిచ్చికూతలు కూస్తున్న ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పిలుపునిచ్చారు. సీఎం పర్యటనపై సోమవారం జనగామ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జనగామదేనని, బహిరంగసభను విజయవంతం చేసే బాధ్యతను ప్రతి గులాబీ కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. కనీసం విభజన హామీల అమలు సహా ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు వంటి ఒక్కటీ నెరవేర్చకుండా రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి, కరంట్ మోటర్లకు మీటర్లు పెడతామంటూ బీజేపీ నేతలు ఏవోవో కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీల వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్ పెంచాలని శాసనసభ తీర్మానం చేస్తే ఇప్పటికీ అతీగతీ లేదని విమర్శించారు. ఇటీవలి బడ్జెట్లో కేంద్రం ఎవరికి న్యాయం చేసిందని ప్రశ్నించిన మంత్రులు ఏడేండ్లలో తెలంగాణకు నయాపైసా ఇవ్వలేని మండిపడ్డారు. వీళ్లా తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడేదని, పైగా అంబేద్కర్ను కేసీఆర్ తిట్డాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటివరకు 130సార్లు రాజ్యాంగాన్ని సవరించారని, మరోసారి సవరించాలంటే తప్పా? అని మంత్రి ప్రశ్నించారు.
50వేల మందితో సభ
జనగామలో 50వేల మందితో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తామని, టీఆర్ఎస్ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 11న జనగామలో ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభకు జన సమీకరణపై సోమవారం సాయంత్రం టీఆర్ఎస్ నూతన కార్యాలయంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డితో కలిసి సమాలోచనలు చేశారు. ఆ తర్వాత హనుమకొండ హైవేలో సీఎం బహిరంగ సభాస్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఏర్పాటు చేసే బహిరంగసభకు జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేయాలని, అందుకోసం నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.