కరీమాబాద్, మే 10: తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారం రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం రంగశాయిపేట వాటర్ ట్యాంక్ ఆవరణలో 32, 33, 38, 39, 40, 41, 42, 43 డివిజన్ల పరిధిలో తాగునీటి సరఫరాపై కార్పొరేటర్లతో కలిసి బల్దియా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వెనుకబడిన అండర్ రైల్వేగేట్ ప్రాంత పరిధి డివిజన్లలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. తమ డివిజన్లలోని తాగునీటి సమస్యలను కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ స్థానిక కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అధికారులు డివిజన్లలోని తాగునీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. వారం రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ పనులను సత్వరమే పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లీకేజీలు, వాటర్ రిస్టోరేషన్, ఇంటర్ కనెక్షన్, రోడ్డు డ్యామేజీ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అన్నా రు. వేసవి కాలంతోపాటు గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో శాశ్వతంగా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
తాగునీటి సమస్యలతోపాటు రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నా రు. చాలా ప్రాంతాల్లో మిషన్ భగీరథ పైపులైన్ పనులు పెండింగ్లో ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, ఏజెన్సీలు ఎక్కువ సిబ్బందిని నియమించుకొని పను లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పబ్లిక్హెల్త్ అధికారులను ఆదేశించారు. 32వ డివిజన్లో అనేక ప్రాంతాల్లో లీకేజీలు ఉన్నాయని, బోర్లు పనిచేయడం లేదని, బీరన్నకుంట ప్రాంతంలో తాగునీటి సరఫరా లో ప్రెషర్ రావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని డీఈ నరేందర్ను మేయర్ ఆదేశించారు. 33వ డివిజన్లో పోచమ్మ దేవాలయం నుంచి నాలుగు వీధుల్లో నీళ్లు రావడం లేదని ప్రజలు చెబుతున్నారని, వెంటనే ఇంటర్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలన్నారు. 38వ డివిజన్లోని పడమర కోటలో మిషన్భగీరథ లీకేజీలు, మధ్య కోటలోని లీకేజీలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. వారం లీకేజీలు, పైన్లైన్ పను లను పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు. కార్పొరేటర్లు గుండు చందన, మరుపల్ల రవి, పోశాల పద్మ, సిద్దం రాజు, బల్దియా ఈఈలు రాజయ్య, డీఈ నరేందర్, ఏఈలు పబ్లిక్ హెల్త్ ఏఈ వంశీ, లైన్మెన్లు పాల్గొన్నారు.