అత్యాధునిక హంగులతో జనగామ పాలనాసౌధం ముస్తాబైంది. పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కేసీఆర్ సర్కారు కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడంతో పాటు కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.58కోట్లతో జనగామ నడిబొడ్డున సువిశాలమైన వాతావరణంలో కొత్త కలెక్టరేట్ రూపుదిద్దుకుంది. మూడు అంతస్తులతో బిల్డింగ్, అధికారుల క్యాంపు ఆఫీసులు, చూడచక్కని రోడ్లు, ఆహ్లాదం పంచే అందమైన గార్డెనింగ్, సెల్లార్ పార్కింగ్తో పాటు హెలిప్యాడ్, తదితర సౌకర్యాలతో అందుబాటులోకి రాగా, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది.
జనగామ, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : జనగామ కొత్త కలెక్టరేట్(సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ ఒకేచోట అందాలనే ఉద్దేశంతో సూర్యాపేట రోడ్డులో 25 ఎకరాల్లో 2017లో నిర్మాణం చేపట్టగా నేడు అందుబాటులోకి వచ్చింది. 2016 అక్టోబర్ 10న కొత్తగా ఆవిర్భవించిన జనగామ జిల్లాకేంద్రంలో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు వేర్వేరుగా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడేవారు. అన్ని కార్యాలయాలు.. అధికారులు ఒకేచోట ఉంటే పాలన ప్రజలకు చేరువ అవుతుందనే సంకల్పంతో సరిగ్గా ఏడాది తర్వాత 2017 అక్టోబర్ 10న సమీకృత కలెక్టరేట్ భవనానికి అప్పటి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. తొలుత రూ.46 కోట్ల అంచనా వ్యయంతో ట్రాక్స్ అండ్ టవర్స్ కంపెనీ పనులు ప్రారంభించగా.. సెల్లార్ పార్కింగ్ వంటి అదనపు నిర్మాణాలతో నిర్మాణ వ్యయం రూ.58 కోట్లకు చేరుకున్నది. భవనంపై రెండంతస్తులకు వెళ్లడానికి మూడు వైపులా మెట్లతో పాటు లిఫ్ట్ ఏర్పాటుచేశారు. అవసరాన్ని బట్టి మరిన్ని అంతస్తులకు పెంచుకునేలా నిర్మించారు. అధికారుల నివాస గృహాల సముదాయాన్ని సైతం జీఫ్లస్-2 పూర్తి చేశారు. కలెక్టరేట్ ముఖద్వారానికి ఎదురుగా 70మీటర్ల ఎత్తులో జాతీయ పతాకం ఎగిరేలా ఏర్పాటుచేశారు. కలెక్టరేట్ చుట్టూ 30ఫీట్ల రోడ్లు, జంక్షన్లు, పార్కులు నిర్మించారు. వంద వాహనాలు పార్కింగ్ చేసేలా గ్రౌండ్ఫ్లోర్ను సిద్ధంచేశారు. బయటి నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటుచేశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారం నుంచి నాలుగ వరుసల రహదారిని నిర్మించారు. ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి ఆవరణం అంతా పచ్చదనంతో నింపేశారు. కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తా జంక్షన్ వరకు రహదారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.