జిల్లాలో 70 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి
లక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల సేకరణ
ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం
జనగామ, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం సేకరణ శరవేగంగా జరుగుతున్నది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రైతులను జోరుగా వడ్లు సేకరిస్తున్నారు. వానకాలం సీజన్కుగాను జిల్లా వ్యాప్తంగా 2.80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిలో 50 శాతం అంటే 1.40 లక్షల మెట్రిక్ టన్నులు సన్న వడ్లు, 1.40లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు వడ్లు పండుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే ఎకరానికి 24క్వింటాళ్లు వస్తుందని అధికారులు అంచనా వేయగా వివిధ కారణాలతో ఈసారి కేవలం 16 క్వింటాళ్లు మాత్రమే రావడంతో ఈసారి జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 1.50మెట్రిక్ టన్నులకు కుదించారు. ఇప్పటికే దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి అందులో 70 వేల మెట్రిక్ టన్నులకు సంబంధించి రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి బిల్లుల చెల్లింపులోనూ వేగవంతం చేశారు. ధాన్యం విక్రయించిన బిల్లులు జిల్లా పౌరసరఫరాలశాఖకు చేరిన 24 గంటల్లోపే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు చెల్లింపులను జమ చేస్తున్నారు. గతంలో మాదిరిగా గ్రామాల్లోనే సేకరణ జరిపి నేరుగా రైతు ఖాతాల్లోకే వడ్ల పైసలు వేయడం సహా డిఫాల్ట్ మిల్లర్లకు ఈసారి ధాన్యం ఇవ్వొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జిల్లాలో 195 కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 195 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టగా, ఇప్పటికే పలు గ్రామాల్లో ఐకేపీ, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలోని కేంద్రాల్లో 70శాతం సేకరణ పూర్తయింది. గత ఏడాది వానకాలంలో 141 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యాసంగిలో 195 కేంద్రాల ద్వారా వడ్లు సేకరించాలని నిర్ణయించారు. తగ్గిన దిగుబడులతో 11 చోట్ల కేంద్రాలను తొలగించారు. గత ఏడాది ఇదే సీజన్లో జిల్లాలో 1,49,087 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈసీజన్లో 1,90,126 ఎకరాల్లో ధాన్యం పండిస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి అదనంగా 41,039 ఎకరాల్లో వరి అదనంగా సాగైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఉంటేనే మంచిదనే నిర్ణయానికి వచ్చిన అధికారులు గత యాసంగిలో ఎక్కడెక్కడ కేంద్రాలు ఏర్పాటయ్యాయో తిరిగి వాటినే మళ్లీ ఈసీజన్లో ప్రారంభించినా దిగుబడులు తగ్గడంతో సేకరణ లక్ష్యం, కేంద్రాల సంఖ్యను సైతం కుదించారు. జిల్లాలో మొత్తం 195 కేంద్రాలకు గానూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) ఆధ్వర్యంలో 119, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 72 కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నాలుగు కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
1.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ..
ప్రస్తుత సీజన్లో జిల్లా వ్యాప్తంగా 12 మండలాల పరిధిలో 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేసి అందులో 50 శాతం అంటే 1.40 లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం, 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం వస్తుందని భావించారు. అయితే ఈసారి ధాన్యం దిగుబడులు సగానికి పడిపోవడంతో అధికారులు సేకరణ లక్ష్యాన్ని 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించారు. సన్న రకం ధాన్యం స్థానికంగా కొనుగోలు చేస్తుండగా, ప్రభుత్వరంగ సంస్థలకు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు వడ్లు అమ్మకానికి వస్తుందని అధికార యంత్రాంగం లెక్కలు వేసింది. ధాన్యం సేకరణ, రవాణా, డబ్బుల చెల్లింపుల్లో ఇబ్బందులు లేకుండా అధికారులు పక్కా ప్రణాళికలతో ధాన్యం సేకరిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్శాఖ, సహకార శాఖ, వ్యవసాయశాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్రావు పలుమార్లు సమీక్షలు నిర్వహించి కొనుగోళ్లపై దిశానిర్దేశం చేశారు. కేంద్రాల ఏర్పాటు సహా రవాణా, గన్నీ బ్యాగుల సరఫరా, బిల్లుల చెల్లింపు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి సేకరణ లక్ష్యాన్ని 70 శాతం పూర్తి చేశారు. ఈనెలాఖరులో మిగిలిన 30 శాతం ధాన్యం కొనుగోలు చేయడం ద్వారా వందశాతం రైతుల నుంచి పంట కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ఈనెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లు..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడడం సహా బిల్లుల చెల్లింపులోనూ జాప్యం లేకుండా నేరుగా ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. రైతు నుంచి ఎలాంటి తరుగు లేకుండా పారదర్శకంగా కొనుగోలు జరుగుతున్నాయి. ఈసారి ధాన్యం దిగుబడులు తగ్గడంతో సేకరణ లక్ష్యాన్ని 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు కుదించాం. ఇప్పటికే 70 శాతం కొనుగోళ్లు పూర్తి చేసి దాదాపు 70వేల మెట్రిక్ టన్నులకు డబ్బులు చెల్లించాం. జనగామ, రఘునాథపల్లి, బచ్చన్నపేట ప్రాంతాల్లో మినహా జిల్లాలో దాదాపు ధాన్యం సేకరణ పూర్తయింది. ధాన్యాన్ని తెచ్చే రైతులు తాలు, గింజలు, పొల్లు లేకుండా తీసుకురావాలి, తేమ తప్పనిసరి 17 శాతం లోపు ఉంటే రైతులను ఈనెలాఖరులోగా మొత్తం ధాన్యం సేకరిస్తాం. -భాస్కర్రావు, అదనపు కలెక్టర్