ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి
మండలాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుపాలి
మండలసభలో ఎంపీపీ కళావతి
సంగెం, ఆగస్టు 23: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నిధులను వినియోగించుకుంటూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపాలని ఎంపీపీ కందకట్ల కళావతి ప్రజాప్రతినిధులను కోరారు. మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం మండల సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. ఏవో యాకయ్య మాట్లాడుతూ రైతులు తమ పంటల వివరాలను ఏఈవోలకు అందించాలని కోరారు. గ్రామాల్లో ప్రమాదకంగా ఉన్న విద్యుత్ లైన్లను వెంటనే సరి చేయాలని సర్పంచ్లు ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రజక, నాయీబ్రాహ్మణులు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏఈ సూచించారు.
లోకల్ మొక్కలు నాటాలి
హరితహారంలో భాగంగా గ్రామాల్లో లోకల్గా లభించే మొక్కలనే నాటాలని అధికారులు తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో సీసీరోడ్ల కోసం నిధులు మంజూరైనట్లు ఏఈ రమేశ్ తెలిపారు. తాము చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదని ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎల్గూర్, మొండ్రాయి, నల్లబెల్లి చెరువులకు సంబంధించిన తూములు, కాల్వలు సరిగా లేవని, వెంటనే పరిశీలించాలని ప్రజాప్రతినిధులు ఐబీ ఏఈ దృష్టికి తీసుకొచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పంపిణీ చేస్తున్న కోడిగుడ్లు నాసిరకంగా ఉండి దుర్వాసన వస్తున్నాయని, కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని తిమ్మాపురం సర్పంచ్ గన్ను శారద సూపర్వైజర్ను నిలదీశారు. వారానికి ఐదు రోజులు కొవిడ్ టీకాలు వేస్తున్నామని, అర్హులు వ్యాక్సిన్ వేసుకోవాలని డాక్టర్ అశోక్ కోరారు. ఎంపీపీ కళావతి మాట్లాడుతూ పల్లెప్రగతిలో భాగంగా దళిత, గిరిజన తండాల అభివృద్ధి కోసం నివేదికలు పంపించామన్నారు. 15 రోజుల్లో అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాలను పూర్తి చేయాలని ఆమె కోరారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు సన్మానం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ అధికారులు, ప్రజాప్రతినిధులుగా అవార్డులు అందుకున్న వారికి మండల సభలో ఎంపీపీ కళావతి, ఎంపీడీవో మల్లేశం, ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఉత్తమ తహసీల్దార్గా విశ్వనారాయణ, ఉత్తమ డాక్డర్గా పొగాకుల అశోక్, ఉత్తమ సర్పంచ్లుగా రాంచంద్రాపురం సర్పంచ్ బోంపెల్లి జయశ్రీ, బాలునాయక్తండా సర్పంచ్ రజని, ఉత్తమ కానిస్టేబుల్గా కుమార్, ఉత్తమ ఆశ కార్యకర్తగా చింతలపల్లికి చెందిన బండి సుజాత ఎంపిక కాగా, వారిని సత్కరించారు. వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కందకట్ల నరహరి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పులుగు సాగర్రెడ్డి, పీఎస్సై జీనత్కుమార్, ఏవో యాకయ్య, డాక్టర్ వంశీ, ఏఈలు రమేశ్, వేణు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.