విధులకు డుమ్మా కొట్టిన ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలి
అందరూ సమయపాలన పాటించాలి
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్, ఆగస్టు 21: కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం ఆమె బల్దియా ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సముదాయంలోని అన్ని విభాగాల చాంబర్లకు వెళ్లి ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. జనన, మరణ, రికార్డు, హార్టికల్చర్, పోస్టు ఆడిట్ విభాగాల్లో సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైన ఆరుగురు ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. పర్మినెంట్, తాత్కాలిక, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సోమవారం నుంచి బయోమెట్రిక్ హాజరు పద్ధతిని అమలు చేయాలన్నారు. బయోమెట్రిక్ హాజరు ప్రకారమే వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యం వివిధ పనుల కోసం వచ్చే ప్రజలకు ఉద్యోగులు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని అదనపు కమిషనర్కు సూచించారు. మేయర్ వెంట ఆదనపు కమిషనర్ నాగేశ్వర్ ఉన్నారు.
మహేశ్ సేవలు ప్రశంసనీయం
నగర పాలక సంస్థ మలేరియా విభాగంలో దినసరి కూలిగా పని చేస్తున్న మహేశ్ సేవలు ప్రశంసనీయమని మేయర్ అన్నారు. వివిధ సేవా కార్యక్రమాల్లో ముందున్నందుకు ఇటీవల గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి పొందిన డాక్టరేట్, ప్రశంసాపత్రాన్ని మహేశ్ మేయర్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దినసరి కార్మికుడిగా పనిచేస్తూ సమాజ సేవ చేయాలనే తపనతో సొంత ఖర్చులతో ఇతరులకు సేవ చేస్తున్న గుజ్జారి మహేశ్ అభినందనీయడని తెలిపారు. అంధ విద్యార్థులకు అన్నదానం, కరోనా సమయంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు.