పుట్టలో పాలు పోసిన మహిళలు
నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు
గీసుగొండ, ఆగస్టు 13: జిల్లావ్యాప్తంగా శుక్రవారం నాగుల పంచమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గీసుగొండ మండలం ఊకల్లోని శ్రీనాగేంద్రస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. మహిళలు పుట్టను అలంకరించి పాలు పోశారు. అనంతరం వెండికన్ను, పైడికన్నును స్వామి వారికి సమర్పించారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సతీమణి జ్యోతి నాగేంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సర్పంచ్ నాగదేవత, ఎంపీటీసీ వీరారావు, పీఎసీఎస్ చైర్మన్ వీరస్వామి, నాయకులు శివ, నర్సింగరావు, వెంకటేశ్వర్లు, ధనుంజయ్, సర్పంచ్లు, భక్తులు పాల్గొన్నారు.
నర్సంపేట: పట్టణంలో అటవీ శాఖ కార్యాలయం పక్కన ఉన్న ఆలయంతోపాటు సర్వాపురం శివారులో ఉన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు నాగమయ్యకు పండ్లు, కోడిగుడ్లు, పసుపు, కుంకుమ, నాగపడిగె సమర్పించి, పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు.
పరకాల: భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పట్టణంలోని శ్రీభవానీకుంకుమేశ్వర ఆలయ ఆవరణలో ఉన్న పుట్టలో పాలు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉదయం సుప్రభాతసేవ, ప్రాతఃకాల పూజ, పంచామృత అభిషేకం, స్కందార్చన పూజలను సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలయ కమిటీ, అధికారులు భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు భక్తులకు సుగంధాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బిల్ల శ్రీనివాస్, అర్చకుడు కోమాళ్లపల్లి నాగభూషణశర్మ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: మండలంలో భక్తులు సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకొని గడపలు, పూజగదిని పసుపు కుంకుమలు, పుష్పాలతో అలంకరించారు. చెన్నారావుపేటలో సిద్ధేశ్వరాలయ ప్రాంగణంలోని నాగదేవతల ప్రతిమకు మహిళలు నేతి, పాలతో అభిషేకం చేసి పెరుగును నైవేద్యంగా పెట్టి పూజలు చేశారు. ఉప్పరపల్లిలోని చెరువుకట్టపై ఉన్న పుట్టలో మహిళలు పాలు పోసి పూజలు చేశారు.
దుగ్గొండి: మండలవ్యాప్తంగా ఆలయాల్లో భక్తులు నాగదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయన్నే మహిళలు, చిన్నారులు స్నానమాచరించి పుట్టల వద్దకు వెళ్లి పసుపు కుంకుమలు చల్లి పాలు పోశారు. నాగేంద్రస్వామికి పూజలు చేసి కోడిగుడ్లు పెట్టి పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేసి తమ కోర్కెలు తీర్చాలని దేవుడిని వేడుకున్నారు.
నల్లబెల్లి: మండలకేంద్రంలోని నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో ఉన్న పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమ, ధూపదీప నైవేద్యాలు సమర్పించి తమ కోర్కెలు తీర్చాలని నాగంద్రుడిని వేడుకున్నారు.
దామెర: ఊరుగొండలోని శివనాగమయ్య ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నాగేంద్రుడి పుట్టలో పాలు పోసి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నారు. కోగిల్వాయి, పులుకుర్తి, దామెరలోని ప్రజలు నాగుల పంచమిని పురస్కరించుకుని సమీప ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో అర్చకులు తూపురాణి శ్రీనివాసాచార్యులు, అఖిలకుమారాచార్యులు పాల్గొన్నారు.