వారం నుంచి దవాఖానలో చికిత్సపొంది ఇంటికొచ్చిన రోజే కాటేసిన పాము
వెంటనే దవాఖానకు తరలింపు
హాస్పిటల్లో చద్దర్ నుంచి కిందపడిన నీరటి పాము
పాప తండ్రినీ కాటువేయగా చికిత్సతో తప్పిన ప్రాణాపాయం
మృతి చెందిన చిన్నారి
పరామర్శించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్రూరల్, నవంబర్ 7: పాముకాటుతో మూడు నెలల చిన్నారి మృతిచెందిన ఘటన మండలంలోని శనిగపురం గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన వేర్పుల క్రాంతి, మమత దంపతుల మూడు నెలల కూతురు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ క్రమంలో ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వారం రోజులు వైద్యం చేయించి శనివారం సాయంత్రం ఇంటికి తీసుకొచ్చారు. రాత్రి చద్దర్పై పడుకోబెట్టగా, సుమారు 9 గంటల సమయంలో ఒక్కసారి పాప గట్టిగా ఏడ్చింది. వెంటనే తల్లిదండ్రులు చద్దర్తో సహా పాపను తీసుకుని మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు. చిన్నారిని డాక్టర్కు చూపిస్తున్న క్రమంలో చద్దర్ నుంచి పాము కింద పడింది. గమనించని చిన్నారి తండ్రి దాన్ని తొక్కడంతో కాటు అతడిని కాటటు వేసింది. వైద్యులు ఇద్దరికీ వైద్యం అందిస్తున్న క్రమంలో సుమారు 10.30 గంటలకు పాప మృతి చెందింది. తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యు లు లిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
శనిగపురంలో పాము కాటుకు గురై మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే శంకర్నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందచేసి ప్రభుత్వం పరంగా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, మార్నేని వెంకన్న, నాయిని రంజిత్, రాజు, హరి పాల్గొన్నారు.