జనగామ చౌరస్తా, ఏప్రిల్ 13: నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలను గురువారం వెస్ట్జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీ సీతారాం వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. జనగామ పట్టణంలోని భవానీ నగర్లో ఓ బిల్డింగ్ పెంట్హౌస్లో అద్దెకుంటున్న రియల్ఎస్టేట్ వ్యాపారి వంశీకి తన సొంతూ రు బచ్చన్నపేటకు చెందిన సందెల రాజేశ్ అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఇద్దరు వేర్వేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కాగా, వంశీ ఒకరికి డబ్బులు కట్టాల్సి ఉండడంతో రూ.10 లక్షలు తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు.
ఈ విషయం వంశీ ద్వారా తెలుసుకున్న రాజేశ్ ఆ డబ్బులు ఎలాగైనా కాజేయాలని పథకం వేశాడు. ఈ నెల 9న ఆదివారం సాయంత్రం వంశీ తన ఫ్యామిలీతో కలిసి షాపింగ్కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రాజేశ్ వంశీ ఉండే పెంట్హౌస్ తాళం పగులగొట్టి బీరువాలో దాచుకు న్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. వంశీ ఫిర్యాదు మేర కు జనగామ అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాజేశ్ రూ.10లక్షల నగదుతో వెళ్తుండగా పక్కా సమాచారం మేరకు పోలీసులు జనగామ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుకుని అరెస్ట్ చేశారు. రూ.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన ఏసీపీ దేవేందర్రెడ్డి, జనగామ, నర్మెట సీఐలు ఎలబోయిన శ్రీనివాస్, పీ నాగబాబు, ఎస్సైలు రఘుపతి, సృజన్, ఏఏవో సల్మాన్ పాషా, ఏఎస్సై శ్రీనివాసరాజు, కానిస్టేబుళ్లు మహేశ్, రామన్న, కరుణాకర్, అనిల్ కుమార్, కిరణ్ కుమార్, సాగర్, సురేశ్ను డీసీపీ అభినందించారు.