జనగామ చౌరస్తా, డిసెంబర్ 28 : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణప్రణాళికకు అనుగుణంగా బ్యాంకర్లు రుణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక బడ్జెట్ రూ.3042.90 కోట్లు అని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో పంట రుణాల కోసం రూ.492.19 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు 241.51 కోట్లు, ఎంఎస్ఎంఈలో రూ.80.29 కోట్లు కలిపి మొత్తం రూ.2838.92 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగతా రుణ లక్ష్యాలు త్వరగా పూర్తి చేయాలని శివలింగయ్య కోరారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ పెండింగ్ యూనిట్స్, పీఎంఈజీపీ పెండింగ్ యూనిట్స్ వెంటనే పూర్తి చేయాలన్నారు.
పీఎంఎఫ్ఎంలో 310 యూనిట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 110 యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిగతా యూనిట్ల ఫిబ్రవరిలోపు మంజూరు చేయాలని అధికారులను కోరారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, టర్మ్లోన్స్, ఎంఎస్ఎంఈ, చిన్న పరిశ్రమలు, స్వయం సహాయక సంఘాలు, పీఎంజీఎస్, విద్య, ముద్ర, హౌసింగ్ రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, మెప్మా రుణాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అన్ని వర్గాల అభివృద్ధి కోసం రాయితీ రుణాలు, ఇతర రుణాలు అందించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. అనంతరం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రణాళిక సంపుటితో పాటు కేవీఐసీ-హైదరాబాద్ వారి పీఎంఈజీపీ పథకంపై అవగాహన ప్రచార స్టాండ్ను అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఎల్డీవో రాజేంద్రప్రసాద్, నాబార్డ్ డీడీఎం చంద్రశేఖర్, ఎస్బీఐ ఏజీఎం అలీమొద్దీన్, ఎల్డీఎం ఎం శ్రీధర్, డీఆర్డీఏ పీడీ జీ రాంరెడ్డి, బ్యాంకర్లు పాల్గొన్నారు.