పోచమ్మమైదాన్, మార్చి 29: వరంగల్ పోచమ్మమైదాన్లోని జకోటియా కాంప్లెక్స్లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరగ్గా భారీగా నష్టం వాటిల్లింది. కాంప్లెక్స్లోని రెండో అంతస్తులో ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వరంగల్ డివిజన్ కార్యాలయం, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయం, పక్కనున్న బిలీఫ్ బాంక్వెట్ హాల్, మూడో అంతస్తులో ఉన్న వద్దిరాజు కన్వెన్షన్ మినీ హాల్, డీ కన్వెన్షన్ హాల్లోని సామగ్రి, స్టేషనరీ మొత్తం కాలి బూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది, కార్పొరేషన్ ట్యాంకర్ల ద్వారా తెల్లవారుజామున 2గంటలకు మంటలు అదుపులోకి తెచ్చారు.
కాగా, శుక్రవారం ఉదయం 6 గంటలకు మళ్లీ మంటలు చెలరేగాయి. స్టార్ ఇన్సూరెన్స్ పక్కనున్న కంది చిట్ఫండ్లోకి మంటలు వ్యాపించాయి. దీంతో ఫైర్, డీఆర్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై ఫైరింజిన్లు రప్పించి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీస్ క్లూస్, ఫోరెన్సిక్ టీమ్స్ పరిశీలించారు. డీసీపీ బారీ, ఏసీపీలు నందిరాంనాయక్, సత్యనారాయణ, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ భగవాన్రెడ్డి, ఎస్ఎఫ్వో రవీందర్, సీఐలు తుమ్మ గోపి, శ్రీధర్ పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ట్రాఫిక్ను మళ్లించారు. జకోటియా కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్, మూడు ఫ్లోర్లలో సుమారు 190 షాపులు ఉండగా, భారీ అగ్ని ప్రమాదం నేపథ్యంలో షాపులను మూడు రోజులపాటు ఎవరూ తెరవద్దని అధికారులు ఆదేశించారు.
అగ్ని ప్రమాద స్థలిని అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు, బీజేపీ వరంగల్ అధ్యక్షుడు గంట రవికుమార్ సందర్శించారు. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.10కోట్ల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ సేల్స్ మేనేజర్ ఎం.అనిల్కుమార్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన మట్టెవాడ సీఐ తుమ్మ గోపి ఎంజీఎం దవాఖానలో కోలుకున్నారు. ఫైర్ హోంగార్డు గిరి చేయి విరగడంతోపాటు కాలిన గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు.